
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతోంది.. గల్ఫ్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.. దీంతో యుద్ధం ప్రభావం ప్రపంచమంతా కనిపిస్తోంది.. ముఖ్యంగా గ్యాస్, చమురు సరఫరా తగ్గడంతో పలు దేశాల్లో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది.. ముఖ్యంగా భారత్ లో సైతం గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత కనిపిస్తోంది.. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శుక్రవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్న ప్రధాని మోదీ.. పశ్చిమాసియా పరిస్థితులతోపాటు.. దేశంలో నెలకొన్న పరిస్థితులపై కూడా సీఎంలతో నేరుగా మాట్లాడనున్నారు. అయితే.. ఈ సమావేశంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడనున్నారనేది ఉత్కంఠగా మారింది.
కాగా.. పార్లమెంట్ సమావేశాల్లో ఇటీవల ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో దేశంలో ఇంధన కొరత నెలకొందని.. అయితే.. ఎలాంటి పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉందని.. దేశ ప్రజలు ఏ సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగిస్తూ.. దేశప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇంధన భద్రత, భారతీయుల రక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్ అతలాకుతలమవుతోందని.. దేశంలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. తాము గల్ఫ్ దేశాలు, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని.. చర్చలు, దౌత్యం ద్వారానే శాంతిని పునరుద్ధరించాలని భారత్ బలంగా నమ్ముతోందని.. అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.