
బంగ్లాదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత, బిఎన్పి చైర్పర్సన్ తారిఖ్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం (ఫిబ్రవరి 17, 2025) ఢాకాలో జరగనుంది. ఘనంగా నిర్వహిస్తున్న ప్రమాణస్వీ్కారోత్సవానికి భారత ప్రధాని మంత్రికి కూడా ఆహ్వానం పంపించారు తారిఖ్ రెహమాన్. అయితే భారతదేశం తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కాగా, ఫిబ్రవరి 17న ప్రధాని మోదీ ముంబైలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలోనే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ ఫిబ్రవరి 17న జాతీయ పార్లమెంట్ కాంప్లెక్స్లోని సౌత్ ప్లాజాలో బిఎన్పి చైర్మన్ తారిక్ రెహమాన్ కొత్త మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయిస్తారని అధికారులు తెలిపారు. ఈ వేడుకలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇది జాతీయ పార్లమెంట్ కాంప్లెక్స్లోని సౌత్ ప్లాజాలో జరుగుతోంది. అయితే ఇప్పటివరకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరిగాయి.
పదవీచ్యుత ప్రధానమంత్రి షేక్ హసీనా,యు ఆమె అవామీ లీగ్ పార్టీని బహిష్కరించిన తర్వాత భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలనే కోరికను బంగ్లాదేశ్ వ్యక్తం చేసింది. పరస్పర ప్రయోజనం కోసం రెండు దేశాలు కలిసి పనిచేయాలని బిఎన్పి చైర్పర్సన్ తారిక్ రెహమాన్ సలహాదారు హుమాయున్ కబీర్ అన్నారు. బిఎన్పి అఖండ విజయం తర్వాత బంగ్లాదేశ్లో మారిన రాజకీయ వాస్తవికతను అంగీకరించడం ఇప్పుడు భారతదేశ బాధ్యత అని ఆయన చెప్పారు. హుమాయున్ కబీర్ మాట్లాడుతూ, “షేక్ హసీనా, అవామీ లీగ్ నేటి బంగ్లాదేశ్లో లేవు. ప్రజలు స్పష్టంగా బిఎన్పికి అనుకూలంగా ఓటు వేశారు.” అని ఆయన తెలిపారు. ఆగస్టు 2024 తిరుగుబాటు తర్వాత భారతదేశానికి పారిపోయిన హసీనాను ఉగ్రవాదిగా ముద్రవేసి, 1,500 మందికి పైగా మరణాలకు ఆమె కారణమని ఆరోపించారు.
బంగ్లాదేశ్ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు షేక్ హసీనా తోపాటు ఇతర అవామీ లీగ్ నాయకులు తమ భూభాగాన్ని ఉపయోగించుకోవడానికి భారత ప్రభుత్వాన్ని అనుమతించవద్దని ఆయన కోరారు. “బంగ్లాదేశ్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఏ కార్యకలాపాలలోనూ భారతదేశాన్ని భాగస్వామిగా చూడకూడదు. ఈ సమస్య పరిష్కారమైన తర్వాత, సాధారణ దౌత్య సహకారం తిరిగి ప్రారంభమవుతుంది. మనం పొరుగు దేశాలం, పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేయాలి” అని తారిక్ రెహమాన్ సలహాదారు హుమాయున్ కబీర్ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..