సోమనాథ్ ఆలయంలో మోడీ.. 11 పుణ్యక్షేత్రాల జలాలతో శివాభిషేకం.. నేటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

PM Modi Visit Somnath Temple: గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం 75వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన 'అమృత్ పర్వ్' (వేడుక)లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు.

సోమనాథ్ ఆలయంలో మోడీ.. 11 పుణ్యక్షేత్రాల జలాలతో శివాభిషేకం.. నేటి ప్రత్యేకత ఏంటో తెలుసా..?
Somanth Temple-PM Modi

Updated on: May 11, 2026 | 3:41 PM

సోమనాథ ఆలయ పునర్నిర్మాణం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. సోమవారం, ఆయన సోమనాథ ఆలయంలో జరిగిన ‘అమృత్ పర్వ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని సాంప్రదాయబద్ధంగా పూజ నిర్వహించారు. శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ ఆలయపు వైభవోపేత శిఖరానికి, దేశవ్యాప్తంగా ఉన్న 11 పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన జలాలతో అభిషేకం చేశారు.

పునరుద్ధరించిన సోమనాథ ఆలయాన్ని భారతదేశపు మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల కళాకారులు, సుదూర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు.

ప్రధాని రోడ్ షో

సోమనాథ్ ఆలయంలో జరిగే సోమనాథ్ అమృత్ మహోత్సవంలో పాల్గొనడానికి ముందు, ప్రధాని మోదీ ఒక భారీ రోడ్ షో నిర్వహించారు. ఆయనతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ కూడా ఉన్నారు. ప్రధానికి స్వాగతం పలకడానికి రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. నగరం అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రజలు చేతుల్లో జెండాలు, బ్యానర్లతో ప్రధానికి స్వాగతం పలికారు. “హర్ హర్ మహాదేవ్”, “మోదీ-మోదీ” నినాదాలతో వాతావరణం మారుమోగింది. ప్రధాని కూడా చేయి ఊపి అందరికీ అభివాదం చేశారు.

కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మే 11న తాను తలపెట్టిన సోమనాథ ఆలయ పర్యటనకు ముందు, ఆలయ నాగరికతా ప్రాముఖ్యతను వివరిస్తూ, శతాబ్దాలుగా దానిని పరిరక్షించి, పునరుద్ధరించిన వారికి నివాళులర్పిస్తూ శుక్రవారం సోషల్ మీడియాలో ఒక వ్యాసాన్ని పంచుకున్నారు.


“మే 11న నేను సోమనాథ్‌లో చేయబోయే పర్యటన గురించి ఒక సంపాదకీయం రాశాను. సోమనాథ్, మన నాగరికత గొప్పతనం నేపథ్యంలో ఈ రోజు ఎందుకు ఎల్లప్పుడూ ముఖ్యమైనదో అందులో వివరించాను,” అని ప్రధాని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. “అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొని కూడా సోమనాథ్‌ను పరిరక్షించి, దాని గౌరవాన్ని పునరుద్ధరించిన వారందరికీ నేను నివాళులర్పించాను,” అని ఆయన అన్నారు.


తన వ్యాసంలో ప్రధాని, భారతదేశపు మొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్.. పునరుద్ధరించిన సోమనాథ ఆలయాన్ని ప్రారంభించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయంపై జరిగిన మొదటి దాడికి 1,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సోమనాథ స్వాభిమాన్ పర్వంలో పాల్గొన్న విషయాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. సోమనాథ యాత్రను శిథిలాల నుండి పునర్నిర్మాణానికి, విధ్వంసం నుంచి సృష్టికి సాగే ప్రయాణంగా అభివర్ణించారు.

Follow Us