ఒకే కారులో మోదీ-పుతిన్.. ప్రపంచానికి స్ట్రాంగ్ మెస్సేజ్.. అందరి కళ్లు ఆ విమానంపైనే..

Putin India visit: రెండు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన ఈ పర్యటనలో మోదీ, పుతిన్‌లు ఒకే కారులో ప్రయాణించడం భారత్-రష్యా బలమైన సంబంధాలకు ప్రతీక. ఇది ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాన్ని, నాయకుల వ్యక్తిగత అనుబంధాన్ని చాటుతోంది.

ఒకే కారులో మోదీ-పుతిన్.. ప్రపంచానికి స్ట్రాంగ్ మెస్సేజ్.. అందరి కళ్లు ఆ విమానంపైనే..
Putin Modi

Updated on: Dec 04, 2025 | 8:18 PM

రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఘనస్వాగతం లభించింది. పాలెం ఎయిర్ పోర్టులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రోటోకాల్ పక్కనబెట్టి పుతిన్‌కు స్వాగతం పలికారు. పుతిన్ పర్యటనను ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. పుతిన్ విమానం ఢిల్లీలో ల్యాండ్ కావడానికి ముందు ప్రముఖ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్ రాడార్ 24 ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధికంగా ట్రాక్ చేయబడిన విమానంగా పుతిన్ ప్రయాణించిన విమానం నమోదైంది. ఈ పర్యటనపై ప్రపంచ దేశాలు ఎంత దృష్టి సారించాయో అనడానికి ఇదే నిదర్శనం.

ఈ క్రమంలో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరేటప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, పుతిన్ ఇద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. ఇద్దరు ప్రపంచ నాయకులు ఇలా కలిసి ప్రయాణించడం అనేది భారత్-రష్యా స్నేహబంధం ఎంత బలంగా ఉందో చెప్పకనే చెబుతోంది. ఇద్దరు నాయకులు ఒకే వాహనంలో ప్రయాణించడం ఇదే మొదటిసారి కాదు. ఇది ఇద్దరు నాయకుల మధ్య వ్యక్తిగత బంధాన్ని, దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని సూచిస్తుంది. సెప్టెంబర్‌లో చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం సందర్భంగా కూడా మోదీ, పుతిన్ ఒకే వాహనంలో ప్రయాణించారు.

ఆ సమయంలో అమెరికా భారత్‌పై భారీగా టారీఫ్స్ విధించింది. అటువంటి తరుణంలో మోదీ-పుతిన్ ఒకే కారులో వెళ్లడం.. ప్రపంచ దేశాలకు సరికొత్త సంకేతాన్ని పంపించినట్లు అయ్యింది. చైనాలో పుతిన్ కారు ముందు వెళ్లగా దానిని మోదీ కారు అనుసరించింది. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు నాయకులు ప్రయాణించిన టయోటా ఫార్చ్యూనర్ కారు ముందు వెళ్లగా.. దానిని పుతిన్ కారు అనుసరించడం గమనార్హం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..