
దేశంలో జరుగుతున్న నేరాలపై కర్ణాటక హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సమాజంలో నేరస్థుల పట్ల చట్టాలు కఠినంగా లేకపోవడం కారణంగా నేరాలు పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించింది. అందుకే జనాలు భయం లేకండా చాలా ఈజీగా నేరాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో తమకు లభించిన హక్కులను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని.. 23 ఏళ్ల అత్యాచార నిందితుడి బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా ఈ కేసును విచారించిన జస్టిస్ ఆర్. నటరాజ్.. మిడిల్ ఈస్ట్ దేశాల తరహాలో, తప్పు చేసిన వారి కాళ్లు, చేతులు నరికేసేలాంటి కఠినమైన శిక్షలు ఉంటేనే ప్రజల్లో చట్టాల పట్ల భయం, గౌరవం పెరుగుతాయేమోనని అభిప్రాయపడ్డారు. మనం నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. తప్పు చేసిన వాడి చేతో, కాలునో నరికివేస్తే.. బహుశా అప్పుడైనా ప్రజలు చట్టాన్ని గౌరవించడం నేర్చుకుంటారేమో అన్నారు. మనది ప్రజాస్వామ్యం కావడం వల్ల, ప్రతి ఒక్కరూ దీనిని లైట్ తీసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ రేప్ కేసులో గత ఏప్రిల్ 5 నుండి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఓ నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక ఘటనపై విచారణ జరిపిన కోర్టు నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ తదుపరి విచారణను జూన్ 8కి వాయిదా వేసింది.
కేసు నేపథ్యం ఏమిటి?
నిందితుడి తరపు న్యాయవాది అయంతికా మోండల్ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. నిందితుడు దాదాపు రెండు నెలలుగా జైల్లో ఉన్నాడని, అసలు ఎలాంటి నేరమూ జరగలేదని పేర్కొన్నారు. మూడేళ్ల క్రితం జరిగిందని చెబుతున్న ఘటనపై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నిందితుడిని ఇలాగే జైల్లో ఉంచితే అతని వృత్తిపరమైన భవిష్యత్తు దెబ్బతింటుందని వాదించారు.
అయితే ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. బాధిత యువతి, నిందితుడు కార్తీక్ రెడ్డి ఇద్దరూ మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) లో చదివారు. అయితే జూలై 2023లో నిందితుడు కార్తిక్ అమెను ప్రేమిస్తున్నట్టు చెప్పడంతో తొలుత ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. కానీ తర్వాత అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో అతన్ని దూరం పెట్టింది. దీంతో కోపం పెంచుకున్న కార్తీక్ సెప్టెంబర్ 12, 2023న ఆమెతో మాట్లాడాలని తన అపార్ట్ మెంట్కు తీసుకెళ్లి అక్కడ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి బెంగళూరులోని జాతీయ మహిళా కమిషన్ను ఆశ్రయించింది. అనంతరం ఉడుపి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఘటనపై ఐపీసీ సెక్షన్లు 375(ఎ), 376 కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.