
దక్షిణాసియాలో సముద్ర వ్యూహాత్మక సమతుల్యతను మార్చే దిశగా చైనా, పాకిస్తాన్ వేగంగా అడుగులు వేస్తున్నాయి. 1971 ఇండో-పాక్ యుద్ధం తర్వాత దాదాపు 55 ఏళ్లకు తొలిసారిగా బంగాళాఖాతంలో తన జలాంతర్గాములను మోహరించేందుకు పాకిస్తాన్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. చైనా సహకారంతో అత్యాధునిక జలాంతర్గాములను సమకూర్చుకున్న పాకిస్తాన్ నౌకాదళం, అరేబియా సముద్రాన్ని దాటి హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచాలని చూస్తోంది.
ఇటీవల శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన కార్యక్రమంలో పాకిస్తాన్ నావికాదళానికి చెందిన కమోడోర్ ఉమర్ ఫరూఖ్ చేసిన వ్యాఖ్యలు భారత భద్రతా వ్యవస్థల్లో చర్చకు దారితీశాయి. కొత్తగా నౌకాదళంలో చేరిన పీఎన్ఎస్ హంగోర్ జలాంతర్గామి వల్ల పాకిస్తాన్ నౌకాదళం కార్యాచరణ పరిధి గణనీయంగా పెరిగిందన్నారు. బంగాళాఖాతం వంటి దూర ప్రాంతాల్లో కూడా తమ ఉనికిని చాటుకునే సామర్థ్యం లభించిందని ఆయన పేర్కొన్నారు.
అయితే బంగాళాఖాతం పేరు వినగానే 1971 యుద్ధం జ్ఞాపకాలు వెంటాడుతాయి. ఆ సమయంలో పాకిస్తాన్ తన అత్యంత కీలక జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీని భారత నౌకాదళ ప్రధాన బలగాలపై దాడి చేయడానికి పంపింది. భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ధ్వంసం చేయడం, విశాఖపట్నం నౌకాశ్రయాన్ని మైన్లతో దిగ్బంధించడం ఘాజీ లక్ష్యం. కానీ 1971 డిసెంబర్ 3-4 మధ్య రాత్రి విశాఖపట్నం తీరంలో ఘాజీ మునిగిపోయింది. ఈ ఘటనలో 93 మంది పాకిస్తానీ నావికులు మరణించారు. అప్పటి నుంచి బంగాళాఖాతంలో పాకిస్తాన్ నౌకాదళ ఉనికి దాదాపు కనిపించలేదు.
ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. చైనా సహకారంతో పాకిస్తాన్ ఎనిమిది హంగోర్-తరగతి జలాంతర్గాములను సమకూర్చుకుంటోంది. ఇవి చైనా టైప్-039బీ యువాన్ క్లాస్ జలాంతర్గాముల ఆధారంగా అభివృద్ధి చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి జలాంతర్గామి పీఎన్ఎస్ హంగోర్ ఇప్పటికే పాకిస్తాన్ నౌకాదళంలో చేరింది. మిగిలిన జలాంతర్గాములు 2028 నాటికి సేవల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ జలాంతర్గాముల ప్రత్యేకత ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ (AIP) సాంకేతికత. దీని ద్వారా అవి వారాల తరబడి సముద్రం అడుగునే ప్రయాణించగలవు. ఉపరితలంపైకి రాకుండానే ఆపరేషన్లు నిర్వహించగల కారణంగా వాటిని గుర్తించడం కష్టతరమవుతుంది. ఇదే పాకిస్తాన్కు కొత్త ధైర్యాన్ని ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే బంగాళాఖాతంలో భారత ఆధిపత్యాన్ని సవాలు చేయడం అంత సులభం కాదని రక్షణ నిపుణులు చెబుతున్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న భారత తూర్పు నావికాదళ కమాండ్, ఆధునిక యుద్ధనౌకలు, జలాంతర్గామి నిరోధక వ్యవస్థలు, అమెరికా తయారీ పీ-8ఐ పోసిడాన్ సముద్ర నిఘా విమానాలతో బలంగా ఉంది. సముద్రంలో దాగి ఉన్న జలాంతర్గాములను గుర్తించడంలో ఈ విమానాలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా గుర్తింపు పొందాయి.
అంతేకాకుండా భారత నౌకాదళ యుద్ధనౌకలపై మోహరించిన ఎంహెచ్-60ఆర్ రోమియో హెలికాప్టర్లు కూడా జలాంతర్గాములను గుర్తించి వెంటనే ప్రతిస్పందించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. దీంతో బంగాళాఖాతంలోకి ప్రవేశించే ఏ విదేశీ జలాంతర్గామైనా భారత నిఘా వలలో చిక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
పాకిస్తాన్కు మరో పెద్ద సవాలు రవాణా, సరఫరా వ్యవస్థ. కరాచీ నుంచి బంగాళాఖాతం వరకు ఉన్న భారీ దూరం కారణంగా నిరంతర మోహరింపులు కొనసాగించడం అంత తేలిక కాదు. మధ్యలో మిత్రదేశాల నుంచి ఇంధనం, సాంకేతిక సహకారం లేకపోతే ఆపరేషన్లు నిర్వహించడం క్లిష్టమవుతుంది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, పాకిస్తాన్ తాజా వ్యూహం వెనుక చైనా “స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్” వ్యూహం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. భారతదేశాన్ని సముద్ర మార్గాల్లో చుట్టుముట్టే ప్రయత్నాల్లో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయని భావిస్తున్నారు. అయితే ఐఎన్ఎస్ అరిహంత్ వంటి అణుజలాంతర్గాములు, విశాఖపట్నంలో అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక నౌకా స్థావరాలు, ఆధునిక నిఘా వ్యవస్థలతో భారత్ బంగాళాఖాతంలో ఇప్పటికీ తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. పాకిస్తాన్ కొత్త ప్రయత్నాలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచినా, భారత నౌకాదళం కట్టుదిట్టమైన నిఘా ముందు అవి ఎంతవరకు సఫలమవుతాయనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..