Noodles: అయ్యో పాపం.. ఆన్‌లైన్‌లో కొన్న నూడిల్స్‌ తిని బాలిక దుర్మరణం..! అధికారుల తనిఖీల్లో..

| Edited By: Janardhan Veluru

Sep 03, 2024 | 6:32 PM

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన చైనీస్ నూడుల్స్ తిని 16 యేళ్ల బాలిక మృత్యువాత పడిన సంఘటన తమిళనాడులో సంచలనంగా మారింది. ఈ ఘటనలో తిరుచ్చిలో నూడిల్ హోల్‌సేల్ వ్యాపారులపై దాడి చేసిన ఆరోగ్య శాఖ.. కిలోల కొద్దీ పాడైన నూడుల్స్ పట్టుబడడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది..

Noodles: అయ్యో పాపం.. ఆన్‌లైన్‌లో కొన్న నూడిల్స్‌ తిని బాలిక దుర్మరణం..! అధికారుల తనిఖీల్లో..
Noodle Nightmare
Follow us on

ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన చైనీస్ నూడుల్స్ తిని 16 యేళ్ల బాలిక మృత్యువాత పడిన సంఘటన తమిళనాడులో సంచలనంగా మారింది. ఈ ఘటనలో తిరుచ్చిలో నూడిల్ హోల్‌సేల్ వ్యాపారుల నిల్వలపై దాడి చేసిన ఆరోగ్య శాఖ అధికారులు.. కిలోల కొద్దీ పాడైన నూడుల్స్ పట్టుబడడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైయ్యారు. మొత్తం 800 కిలోల ఎక్స్‌పైర్ అయిన చైనీస్‌ నూడిల్స్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.

అరియమంగళం పరిధిలోని అంబికాపురానికి చెందిన జాన్ జూడీ మెయిల్స్ అనే వ్యక్తి తిరుచ్చి జిల్లాలోని తిరువెరంపూర్ ప్రాంతానికి చెందిన రైల్వే ఉద్యోగి. తన కుటుంబంతో కలిసి అదే ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతని 15 ఏళ్ల కుమార్తె స్టెఫీ జాక్వెలిన్ ఓ ప్రైవేట్ పాఠశాలలో పదకొండవ తరగతి చదువుతోంది. స్టెఫీకి నూడుల్స్ అంటే మహా ఇష్టం. దీంతో స్టెఫీ జాక్లిన్ నూడుల్స్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. ఆర్డర్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నూడుల్స్ ఇంటికి చేరాయి. శనివారం రాత్రి వాటిని వండి తినేసి, నిద్రపోయింది. అయితే ఆదివారం ఉదయం ఎంతపేపటికీ స్టెఫీ నిద్ర లేవకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ స్టెఫీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్టెఫీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుచ్చి ప్రభుత్వాసుపత్రికి తరలించగా నూడుల్స్‌ తినడం వల్లే బాలిక మృతి చెందినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యన్‌ ధ్రువీకరించారు. అదే సమయంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అప్పగించేందుకు మృతురాలి బంధువులు నిరాకరించడంతో కాసేపు కలకలం రేగింది. దీంతో బాలిక కుటుంబసభ్యులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు నూడుల్స్‌ తినడంతోనే బాలిక చనిపోయిందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.

పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ విచారణలో ఈ నూడుల్స్ చైనాకు చెందినవని, అమెజాన్ ద్వారా కొనుగోలు చేసినట్లు తేలింది. తిరుచిరాపల్లి హోల్‌సేల్ ఫుడ్ బిజినెస్‌లో ఇలాంటి నూడుల్స్ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వైద్యాశాఖ అధికారులు అరియమంగళం ల్యాండ్‌ఫిల్‌లో హోల్‌సేల్‌ వ్యాపారులపై దాడి చేసి ఏకంగా 800 కిలోల గడువు ముగిసిన నూడిల్స్‌ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అదే బ్యాచ్ నంబర్‌తో ఉన్న కోక్ బాటిల్స్‌ను కూడా సీజ్‌ చేశారు. హోల్‌సేల్ ఫుడ్ బిజినెస్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్, 2006 సెక్షన్ 56 ప్రకారం యజమానిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా నామినేటింగ్ అధికారి డాక్టర్ ఆర్ రమేష్ బాబు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.