
ప్రజలు విరాళాలు ఇచ్చిన డబ్బును ఉంచిన బ్యాంకు ఖాతాలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం స్తంభింపజేసిందని, ఆదాయపు పన్ను శాఖ ఆ పార్టీకి భారీ జరిమానాలు విధించిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నిధుల కొరతను ఎదుర్కొంటోందని ఆ పార్టీ అధ్యక్షుడు ఎం.మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు కలిసికట్టుగా నిలబడి రానున్న లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి కృషి చేయాలని ఖర్గే పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండాలని పేర్కొన్న ఖర్గే.. బిజెపి కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిందని, ఆదాయపు పన్ను ద్వారా పార్టీకి భారీ జరిమానాలు విధించిందని ఆరోపించారు, అయితే “సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తమకు వచ్చిన వేలాది కోట్ల రూపాయల వివరాలను వెల్లడించడానికి వారు సిద్ధంగా లేరు” అని ఖర్గే ఆరోపించారు. ప్రజలు విరాళాలుగా ఇచ్చిన మా పార్టీ డబ్బును స్తంభింపజేశారు, ఖర్చు చేయడానికి మా వద్ద డబ్బు లేదు. అయితే బీజేపీ తమకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల గురించి వెల్లడించడం లేదు. ఎందుకంటే వారి కుట్రలు బయటపడుతాయి’’ ఖర్గే మండిపడ్డారు.
2019 ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓడిపోయిన కలబుర్గి (గుల్బర్గా) ప్రజలు తమ తప్పును సరిదిద్దుకుని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని నిర్ణయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో గుల్బర్గాలో బీజేపీ అభ్యర్థి ఉమేష్ జాదవ్ చేతిలో ఖర్గే 95,452 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
బీజేపీ ఈ రోజుల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతోందని, దీనిపై పోరాడాలని, ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. “అది నీ హక్కుకు సంబంధించిన విషయం.. బీజేపీ (రాజ్యాంగాన్ని మార్చడానికి) ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడే వారితో తమకు ఎటువంటి సంబంధం లేదని బిజెపి చెబుతోంది, కానీ అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదు” అని ఖర్గే అన్నారు.