మైనర్ బాలిక చేయి పట్టుకొని ‘ఐ లవ్ యూ’ చెప్పిన ఆకతాయి.. రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

|

Aug 02, 2024 | 8:18 PM

దుఖాణానికి వెళ్తున్న 14 ఏళ్ల బాలిక చేయి పట్టుకుని 19 ఏళ్ల యువకుడు 'ఐ లవ్‌ యూ' అని చెప్పినందుకు పోక్సో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన మైనర్ బాలిక తల్లి సకినాకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 2019లో కేసు నమోదైంది. 14 ఏళ్ల బాలిక టీ పొడి కొనేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లింది..

మైనర్ బాలిక చేయి పట్టుకొని ఐ లవ్ యూ చెప్పిన ఆకతాయి.. రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
Mumbai Man Gets Two Year Imprisonment
Follow us on

ముంబై, ఆగస్టు 2: దుఖాణానికి వెళ్తున్న 14 ఏళ్ల బాలిక చేయి పట్టుకుని 19 ఏళ్ల యువకుడు ‘ఐ లవ్‌ యూ’ అని చెప్పినందుకు పోక్సో కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ప్రాసిక్యూషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైకి చెందిన మైనర్ బాలిక తల్లి సకినాకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సెప్టెంబర్ 2019లో కేసు నమోదైంది. 14 ఏళ్ల బాలిక టీ పొడి కొనేందుకు సమీపంలోని దుకాణానికి వెళ్లింది. అనంతరం కాసేపటికి ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చింది. తల్లి ఏం జరిగిందని బాలికను అడుగగా.. ఒక వ్యక్తి తనను సమీపంలోని భవనంలోని మొదటి అంతస్తులోకి తీసుకెళ్లి, తన చేయి పట్టుకుని ‘ఐ లవ్‌ యూ’ అని చెప్పాడని బాలిక వెల్లడించింది. బాలిక చెప్పిన వివరాలు విన్న తల్లి వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సదరు ఆకతాయిపై ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరుపరిచారు. అయితే విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించలేదు. విచారణ సమయంలో బాధితురాలు, ఆమె తల్లితో సహా నలుగురు సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టడంతో ప్రాసిక్యూషన్ నేరాన్ని నిర్ధారించింది. అయితే నిందితుడు మాత్రం తాను నిర్దోషినని, బాదిత బాలిక తనకు ముందు నుంచే తెలుసని, తామిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు రివర్స్‌ డ్రామా ఆడాడు. సంఘటన జరిగిన రోజు బాలికే తనను కలిసేందుకు పిలిచిందని బొంకాడు.

బాధితురాలు నిజంగానే నిందితుడితో సంబంధం పెట్టుకుని ఉంటే.. భయపడి తన తల్లితో చెప్పేది కాదని కోర్టు అనుమానం లేవనెత్తింది. అంతేకాకుండా, సంఘటన అనంతరం బాలిక తల్లి నిందితుడిని ప్రశ్నించేందుకు యత్నించగా.. అతడు ఆమెను బెదిరించినట్లు కోర్టుకు తెలిపారు. బాధితురాలు, ఆమె తల్లి చెప్పిన సాక్ష్యం ఒకదానితో ఒకటి సరిగ్గా సరిపోయాయని, సాక్ష్యాలను తారుమారు చేసే అంశాలు ఏవీ రికార్డు కాలేదని కోర్టు వాదించింది. నిందితుడితో ప్రేమ వ్యవహారంపై బాధిత బాలిక, ఆమె తల్లి ఇద్దరూ ఖండించారు. బాధితురాలు టీ పొడి తీసుకురావడానికి వెళుతున్నప్పుడు ఆమె చేతిని పట్టుకోవడం ద్వారా నిందితుడు ఆమెపై క్రిమినల్ ఫోర్స్ ప్రయోగించినట్లు నిర్ధారణ అయినట్లు కోర్టు పేర్కొంది. అనంతరం నిందితుడికి సంబంధిత సెక్షన్ల కింద రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. ఈ మేరకు జులై 30న  తీర్పు వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.