
మేఘాలయ హనీమూన్ హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రఘువంశీ, సోనమ్లు బస చేసిన హోమ్స్టే రూంలో దొరికిన వస్తువులు కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారాలయ్యాయి. హోమ్స్టే నుంచి బయటికి వెళ్లేటప్పుడు భర్తకు అవే చివరి ఘడియలని సోనమ్కి తెలుసు. అందుకే అప్పటిదాకా మెడలో భారంలా భరిస్తూ వచ్చిన మంగళసూత్రాన్ని గదిలోనే వదిలేసింది. ఆమె ఉంగరాన్ని కూడా ఆ గదినుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హనీమూన్ సమయంలో కొత్తగా పెళ్లయిన మహిళ మంగళసూత్రాన్ని వదిలి వెళ్లటంతో జంట అదృశ్యం తర్వాత షిల్లాంగ్ పోలీసులు సోనమ్ని అనుమానించారు. అదే ఈ కేసులో దర్యాప్తు ముందుకెళ్లేందుకు బలమైన ఆధారమైంది. మే 23న కాంట్రాక్ట్ కిల్లర్లు నోంగ్రియాట్ గ్రామంలోని మరో హోమ్స్టేలో కాపుకాశారు. అదే సమయంలో సోనమ్ ఫోటోలు తీసుకునే నెపంతో భర్తను హోమ్ స్టే నుంచి బయటికి తీసుకెళ్లింది.
స్కూటీని నిర్జన ప్రదేశంలో నిలిపేసి.. ఫోటోలు తీస్తున్నట్లు నటిస్తూ సోనమ్ కొంచెం ముందుకు నడిచింది. వారిని అనుసరిస్తూ వచ్చిన హంతకులు వెనుకనుంచి రఘువంశీపై ఎటాక్ చేశారు. హంతకులు రెండు స్కూటీలను వినియోగించారు. భర్త హత్య తర్వాత సోనమ్ ఒక నిందితుడి స్కూటీపై అక్కడినుంచి వెళ్లిపోయిందని గుర్తించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.