
మధ్యప్రదేశ్లోని నర్సింగ్పూర్ జిల్లాలోని నర్మదా నదిపై ఉన్న పవిత్ర బర్మాన్ ఘాట్లో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకుంది. నది ఘాట్లో ఒక యువకుడిపై సీఈఓ గజేంద్ర సింగ్ నగేష్ దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘాట్ సీనియర్ పూజారితో కూడా ఆ అధికారి అనుచితంగా ప్రవర్తించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
నర్మదా నది పరిసరాల్లో పరిశుభ్రత గురించి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జిల్లా పంచాయతీ CEO బర్మాన్ ఘాట్ తనిఖీకి వచ్చారు. తనిఖీ సమయంలో, ఒక యువకుడు బర్మాన్ ఘాట్లో మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది గమనించిన సీఈవో గజేంద్ర సింగ్ అతన్ని గట్టిగా మందలించాడు. అంతేకాదు అతన్ని ఒక చెంపదెబ్బ కొట్టాడు. అంతేకాకుండా, అతని దుకాణాన్ని అక్కడి నుంచి తొలగించాలని ఆదేశించారు. మళ్ళీ ఘాట్ వద్ద కనిపించవద్దని హెచ్చరించాడు. అయితే నిబంధనల ప్రకారం చర్య తీసుకునే బదులు, CEO ఆ యువకుడిపై దాడి చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ సంఘటన తర్వాత, ఘాట్లో సీనియర్ పూజారి పండిట్ కైలాష్ చంద్ర మిశ్రా కూడా CEOపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఘాట్లో అందుబాటులో ఉన్న టాయిలెట్లు, పారిశుధ్యం, ఇతర ప్రాథమిక సౌకర్యాలు లేవని తాను ఎత్తి చూపినప్పుడు, CEO తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆయన పేర్కొన్నారు. ఆ అధికారి తనను అవమానించాడని, ఇది తన సామాజిక గౌరవాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు.
నర్మదా ఘాట్లు మూత్ర విసర్జన కోసమేనా అని ఆ అధికారి తిట్టడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ తర్వాత అతను అక్కడ నిలబడి ఉన్న ఒక యువకుడిని చెంపదెబ్బ కొట్టాడు. అనంతరం మరొక వ్యక్తితో, “నువ్వు ఎంత లోతులో ఉన్నావో అంత లోతుగా పాతిపెడతాను” అని వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో వేగంగా వైరల్ అవుతోంది. అయితే, టీవీ9 దీనిని నిర్ధారించడంలేదు.
ఈ సంఘటనకు నిరసనగా, బ్రాహ్మణ సభ, ఇతర సామాజిక సంస్థలు జిల్లా యంత్రాంగానికి ఒక మెమోరాండం సమర్పించాయి. నిష్పాక్షిక దర్యాప్తు జరిపి ఆ అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని మెమోరాండంలో కోరారు. ఇదిలావుంటే, వివాదం తీవ్రమైన తర్వాత, జిల్లా పంచాయతీ CEO గజేంద్ర సింగ్ నగేష్ తాను నర్మదా నది భక్తుడినని పేర్కొన్నారు. ఘాట్లను శుభ్రం చేయడం చాలా అవసరం. చెత్త వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..