
ముంబై, ఆగస్ట్ 17: శనివారం (ఆగస్టు 15) సాయంత్రం తకిపాడా ప్రాంతంలోని నీలకంఠేశ్వర్ భవనంలో 25 ఏళ్ల మహిళ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో స్థానిక చిన్నారులు సమీపంలోని బేకరీ నుంచి కొనుగోలు చేసిన కేక్ను తీసుకువచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ తిన్న కొద్దిసేపటికే పలువురికి తీవ్ర అస్వస్థత మొదలైంది. వాంతులు, కడుపు నొప్పి, ఛాతిలో మంట, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడటంతో కుటుంబ సభ్యులు వెంటనే వారిని సమీపంలోని విజయలక్ష్మి ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి చేరుకున్న తర్వాత బాధితులు కేక్లో చనిపోయిన బల్లి కనిపించినట్లు వైద్యులకు తెలిపారు. దీంతో ఆహార కలుషితం కారణంగానే అస్వస్థతకు గురై ఉండొచ్చన్న అనుమానంతో వైద్యులు చికిత్స ప్రారంభించారు. మొత్తం 11 మందిని ఆసుపత్రిలో చేర్చినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. విజయలక్ష్మి ఆసుపత్రికి చెందిన డాక్టర్ విద్యా సావంత్ మాట్లాడుతూ.. ముగ్గురు చిన్నారులను ఐసీయూలో ఉంచి ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం మొత్తం 11 మంది పరిస్థితి నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని చెప్పారు. సమాచారం అందుకున్న తులింజ్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో కేక్ను తకిపాడాలోని చాముండా కేక్ షాప్ నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. మిగిలిన కేక్ నమూనాలను పోలీసులు, ఆహార భద్రతా అధికారులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు.
అయితే కేక్లో బల్లి కనిపించినట్లు బాధితులు చెప్పినప్పటికీ.. అస్వస్థతకు అసలు కారణం ఏమిటనేది ప్రయోగశాల పరీక్షల నివేదిక వచ్చిన తర్వాతే అధికారికంగా నిర్ధారించనున్నారు. నివేదిక ఆధారంగా బేకరీపై తదుపరి చర్యలు, తనిఖీలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా ఆహార పదార్థాల తయారీ, నిల్వ, పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. బేకరీలు ఆహార భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.