కుమారస్వామి ప్రభుత్వానికి అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవడానికి మరో డెడ్లైన్ విధించారు గవర్నర్. సాయంత్రం 6.00 గంటల లోపు విశ్వాసపరీక్ష నిర్వహించాలని గవర్నర్ వాజూబాయ్ వాళా ఆదేశించారు. దీంతో కర్నాటక రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. ఇంతకు ముందు ఇచ్చిన గడువు ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలతో ముగిసింది. గవర్నర్ సూచనను కుమారస్వామి, స్పీకర్ పట్టించుకోలేదు. తనను ఎవరూ శాసించలేరని, చర్చ పూర్తి కాకుండా బలపరీక్ష నిర్వహించలేమని స్పీకర్ రమేష్ కుమార్ తేల్చిచెప్పారు. అయినా గవర్నర్ లేఖ పంపింది సీఎం కుమారస్వామికి అని, అందువల్ల నిర్ణయం తీసుకోవాల్సింది కూడా ఆయనేనని అన్నారు. ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేశారనే అంశంపై చర్చ జరగాలని కుమారస్వామి పట్టుబట్టారు. ఇంకా 20 మంది సభలో చర్చలో మాట్లాడాల్సి ఉందన్నారు. మరోవైపు సీఎం కుమారస్వామి తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కావాలనే బలపరీక్ష గడువును కుమారస్వామి పొడిగిస్తున్నారని.. అదే ఆలోచనతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గవర్నర్కు మళ్లీ ఫిర్యాదు చేస్తామని బీజేపీ పేర్కొంది. ఈ క్రమంలోనే బలపరీక్ష గడువును గవర్నర్ మళ్లీ నిర్దేశించడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.