
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోను మెటా (Meta) సంస్థ తొలగించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అనూహ్య చర్యపై కేంద్ర సమాచార ప్రసార, సాంకేతిక మంత్రిత్వ శాఖ (IT Ministry) తీవ్రంగా స్పందించింది. అసలు ఏ ప్రాతిపదికన ప్రధాని పోస్ట్ను తొలగించారో స్పష్టత ఇవ్వాలంటూ మెటా ప్రతినిధులకు అత్యవసర సమన్లు జారీ చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల నేపథ్యంలో ఫేస్బుక్ సహా.. అన్ని ప్లాట్ఫాంలలో ప్రధాని మోదీ యువతను ఉద్దేశించచి ఓ సందేశాన్ని పంచుకున్నారు. ఈ సందేశానికి సంబంధించిన వీడియోని ఫేస్బుక్ లో మెటా బ్లాక్ చేసింది.
ఫేస్బుక్ (మెటా) చర్యపై కేంద్ర ప్రసారశాఖ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతను ఉద్దేశించి చేసిన ఫేస్బుక్ పోస్ట్ను సోషల్ మీడియా సంస్థ మెటా తొలగించిన తర్వాత, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆ సంస్థ గ్లోబల్ హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీని పిలిపించిందని వర్గాలు మంగళవారం (జూలై 28, 2026) తెలిపాయి. అంతేకాకుండా సమన్లు జారీ చేసినట్లు పేర్కొన్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్ల నియంత్రణ, పారదర్శకత లేకపోవడంపై ఐటీ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతకుముందు ప్రధాని మోదీ వీడియో బ్లాక్ పై స్పందించిన మెటా.. ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పింది. దీంతో పాటు.. బ్లాక్ చేయడం సాంకేతిక పొరపాటేనని పేర్కొంది. వీడియోను పునరుద్ధరించామని మెటా ప్రతినిధి ప్రకటించారు.
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన విద్యార్థుల నిరసనల మధ్య జూలై 23న పోస్ట్ చేసిన ఈ వీడియో పరీక్షా పేపర్ ‘లీకుల’పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి మాట్లాడారు.
పరీక్షల పేపర్ లీకేజీలు, కఠిన చట్టాల అంశంపై ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ భారీ స్థాయిలో వ్యూస్ సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే.. ఈ వీడియో బ్లాక్ చేయడం చర్చనీయాంశంగా మారింది.