Ministry of Home Affairs: ఆ యాప్ లపై తక్షణ చర్యలు తీసుకోండి.. రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖలు..
తక్కువ మొత్తంలో రుణాలిచ్చి.. ఎక్కువ మొత్తంలో వసూలు చేయడంతో పాటు.. ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న చైనా లోన్ యాప్ లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను..
తక్కువ మొత్తంలో రుణాలిచ్చి.. ఎక్కువ మొత్తంలో వసూలు చేయడంతో పాటు.. ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న చైనా లోన్ యాప్ లపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఇటీవల కాలంలో లోన్ యాప్ ఆగడాలకు ఎంతో మంది బలిఅవుతున్నారు. రుణ సంస్థల వేధింపులు తట్టుకోలేక, తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుని.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆర్థిక అవసరాల కోసం చాలా మంది లోన్ యాప్ ల ద్వారా రుణాలు తీసుకుంటున్నారు. అయితే ఇచ్చేటప్పుడు నిబంధనలు పూర్తిస్థాయిలో చెప్పకుండా.. తీసుకున్న తర్వాత అధిక వడ్డీలు విధించడంతో పాటు.. తీసుకున్న రుణానికంటే కొన్ని రెట్లు అధికంగా వసూలు చేస్తున్నాయి లోన్ యాప్ సంస్థలు. ఎవరైనా కట్టకపోతే.. వారిని వేధింపులకు గురిచేస్తోంది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో చాలా మంది ఇటీవల కాలంలో ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో, ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న చైనా రుణ యాప్లపై ప్రభుత్వ సంస్థలు తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ కోరింది.
అప్పులు తీసుకున్న వారిని ఈ యాప్లు బ్లాక్మెయిల్ చేయడం, వేధించడం, అప్పులు తిరిగి వసూలు చేసుకునే సమయంలో కఠినమైన పద్ధతులను పాటిస్తున్నాయి. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. చైనా యాప్ల కారణంగా జాతి సమగ్రత, ఆర్థిక వ్యవస్థ, పౌరుల భద్రతపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తంచేసింది. అక్రమ డిజిటల్ రుణ యాప్లకు సంబంధించి దేశవ్యాప్తంగా అనేక ఫిర్యాదులు నమోదయ్యాయని పేర్కొంది. స్వల్పకాలిక రుణాలు, సూక్ష్మ రుణాలు అందిస్తున్న ఈ యాప్లు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయని, ప్రాసెసింగ్, రహస్య రుసుములు విధిస్తూ తక్కువ ఆదాయం ఉన్నవారిని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంటున్నాయని వెల్లడించింది.
అప్పు తీసుకున్నవారిని వేధించేందుకు ఈ యాప్లు రుణగ్రహీతల మొబైల్లోని నంబర్లు, లొకేషన్, ఫొటోలు, వీడియోలు తదితర వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నాయని పేర్కొంది. ఇలా వేధింపులకు గురిచేసే లోన్ యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను కోరింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేటెడ్ ఎంటిటీలు లేని ఈ అక్రమ లోన్ యాప్లు భారీ స్థాయిలో Sms, డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్లు, మొబైల్ యాప్ స్టోర్లను ఉపయోగిస్తున్నాయని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..