
హర్యానాలోని అంబాలా జిల్లాలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. తెరిచి ఉన్న బోర్వెల్లో పడిపోయిన నాలుగేళ్ల పసివాడిని కాపాడుకునేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సుమారు 21 గంటల పాటు జరిపిన పోరాటం విఫలమైంది. బుధవారం (జూలై 01)తెల్లవారుజామున బాలుడిని బయటకు తీసినప్పటికీ, అప్పటికే ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ధనేరా గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
ధనేరా గ్రామానికి చెందిన నిర్వైర్ సింగ్ (4) మంగళవారం (జూన్ 30) ఉదయం తన తండ్రి మంజీత్ సింగ్తో కలిసి పొలానికి వెళ్లాడు. తండ్రి, తాత పనుల్లో నిమగ్నమైన సమయంలో నిర్వైర్ ఆడుకుంటూ పొలంలో తెరిచి ఉన్న బోర్వెల్ వద్దకు వెళ్లాడు. అందులోకి మట్టి పోస్తూ, లోపలికి తొంగి చూసే క్రమంలో తడిమట్టి జారి ఒక్కసారిగా లోపలికి పడిపోయాడు. కుమారుడు పడిపోయిన శబ్దం విన్న తండ్రి, చుట్టుపక్కల వారు కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. ఆ బోర్వెల్ కేవలం 9 అంగుళాల వెడల్పు, 220 అడుగుల లోతు ఉండటంతో సహాయక చర్యలు అత్యంత సవాలుగా మారాయి.
రంగంలోకి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్..
సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం.. ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF) తో పాటు సైన్యాన్ని (Army) రంగంలోకి దించింది. మంగళవారం సాయంత్రం హర్యానా కేబినెట్ మంత్రి అనిల్ విజ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బుధవారం తెల్లవారుజామున 3:40 గంటల ప్రాంతంలో రెస్క్యూ టీమ్ బాలుడిని బయటకు తీసి, గ్రీన్ కారిడార్ ద్వారా అంబాలా కంటోన్మెంట్ సివిల్ ఆసుపత్రికి తరలించింది. అయితే, ఆసుపత్రికి తీసుకువచ్చేసరికే బాలుడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
బోర్వెల్ ప్రమాదాలు దేశంలో కలకలం రేపడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలోనే పంజాబ్లోని హోషియార్పూర్లో ఓ బాలుడు బోర్వెల్లో పడగా 9 గంటల శ్రమతో రక్షించారు. అలాగే, 2006లో హర్యానాలోని కురుక్షేత్రలో ‘ప్రిన్స్’ అనే బాలుడిని 48 గంటల పాటు శ్రమించి రక్షించిన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ, నిర్వైర్ సింగ్ విషయంలో మాత్రం కాలం కలిసిరాలేదు. ఈ ఘటనపై అంబాలా డిప్యూటీ కమిషనర్ అజయ్ సింగ్ తోమర్ స్పందిస్తూ.. బోర్వెల్ తెరిచి ఉంచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు, భూస్వాములు తమ పొలాల్లో ఉన్న నిరుపయోగ బోర్వెల్లను వెంటనే మూసివేయాలని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..