
గుజరాత్లోని సూరత్లో ఓ వృద్ధ దంపతుల ఆవేదన కలకలం రేపుతోంది. అధికారులు, స్థానిక రాజకీయ నాయకుల వేధింపులతో విసిగిపోయామని ఆరోపిస్తూ 73 ఏళ్ల శ్యామ్భాయ్ కపూర్జీ గెహ్లాట్, ఆయన 68 ఏళ్ల భార్య మధుబెన్ జిల్లా కలెక్టర్కు కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ లేఖ రాశారు. సంవత్సరాలుగా తాము శారీరక, మానసిక, ఆర్థిక వేధింపులకు గురవుతున్నామని తమ వినతిపత్రంలో పేర్కొన్నారు.
గెహ్లాట్ దంపతులు 2006లో 11 చిన్న దుకాణాలను కొనుగోలు చేశారు. 2008లో ఆ ప్రాంతం సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ (SMC) పరిధిలోకి వచ్చినప్పటి నుంచి క్రమం తప్పకుండా పన్నులు చెల్లిస్తున్నామని తెలిపారు. అయితే 2021లో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే అధికారులు తమ దుకాణాలను సీల్ చేశారని ఆరోపించారు. దీంతో వారు గుజరాత్ హైకోర్టును ఆశ్రయించి దాదాపు ఐదేళ్లపాటు న్యాయపోరాటం చేశారు.
ఈ ఏడాది జనవరిలో అగ్నిమాపక శాఖ నివేదిక ఆధారంగా హైకోర్టు అనుకూల నిర్ణయం రావడంతో దుకాణాలు తిరిగి తెరుచుకున్నాయి. అయితే కొద్ది నెలలకే, మే 30న మళ్లీ ఎలాంటి లిఖితపూర్వక నోటీసు లేకుండానే దుకాణాలను సీల్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ చర్య వెనుక స్థానిక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని, ఒక బీజేపీ నాయకుడిని కలవాలని అధికారులు ఒత్తిడి తెచ్చారని శ్యామ్భాయ్ పేర్కొన్నారు.
ఇప్పటికే 2016లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడు, కోడలు, మనవళ్లు, కుమార్తె, అల్లుడు సహా కుటుంబంలోని తొమ్మిది మంది సభ్యులను కోల్పోయిన ఈ దంపతులు తీవ్ర విషాదంలో జీవిస్తున్నారు. ఇప్పుడు జీవనాధారమైన దుకాణాలు కూడా మూతపడటంతో ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయామని చెబుతున్నారు. “మాకు బతకాలని కోరిక మిగల్లేదు. న్యాయం జరగకపోతే, మరణమే చివరి మార్గం” అంటూ వారు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. తమపై జరుగుతున్న వేధింపులను భరించే స్థితిలో లేమని పేర్కొంటూ.. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ ఘటన ప్రస్తుతం గుజరాత్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…