Delhi Clashes: ఆ జడ్జిని బదిలీ చేసేశారు… బీజేపీ నేతలను కాపాడేందుకేనా ? ఇదీ సర్కారీ ‘రివెంజ్’?

|

Feb 27, 2020 | 5:01 PM

ఢిల్లీ హింసపై కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీసులను తప్పు పట్టిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేశారు. (ఢిల్లీ హింసలో మరణించినవారి సంఖ్య 34 కి పెరగగా

Delhi Clashes: ఆ జడ్జిని బదిలీ చేసేశారు... బీజేపీ నేతలను కాపాడేందుకేనా ? ఇదీ సర్కారీ రివెంజ్?
Follow us on

Delhi CAA Clashes: ఢిల్లీ హింసపై కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఢిల్లీ పోలీసులను తప్పు పట్టిన ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.మురళీధర్ బదిలీ అయ్యారు. ఆయనను పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేశారు. (ఢిల్లీ హింసలో మరణించినవారి సంఖ్య 34 కి పెరగగా,, గాయపడినవారు సంఖ్య కూడా 200 కి పైగా పెరిగింది). సుమారు రెండు వారల క్రితం సుప్రీంకోర్టు పానెల్ చేసిన సిఫారసులను పురస్కరించుకుని జస్టిస్ మురళీధర్ బదిలీ వ్యవహారం రొటీన్ గా జరిగిందేనని అధికారవర్గాలు పేర్కొన్నప్పటికీ.. కొందరు బీజేపీ నేతలను కాపాడేందుకు కేంద్రం ఈ చర్య తీసుకున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. అలాగే ప్రభుత్వాన్ని, పోలీసులను విమర్శించినందుకు కేంద్రం ‘ప్రతీకార చర్య’గా ఈ నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయాలు  కూడా వినవస్తున్నాయి. జస్టిస్ మురళీధర్ బదిలీకి సంబంధించిన నోటిఫికేషన్ ను బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జారీ చేశారు. ఆయన బదిలీపై సుప్రీంకోర్టు కొలీజియం  ఈ నెల 12 న సిఫారసు చేసిందట. అయితే ఆయన తన కొత్త పోస్టులో ఎప్పుడు జాయిన్ కావాలన్న అంశాన్ని ఈ నోటిఫికేషన్ లో పేర్కొనలేదు.  తక్షణమే చేరాలన్నదే ఈ నోటిఫికేషన్ ఉద్దేశమని భావిస్తున్నారు. సాధారణంగా ఒక జడ్జిని బదిలీ చేసినప్పుడు ఆయన తన కొత్త పోస్టులో చేరేందుకు 14 రోజుల వ్యవధినిస్తారు. కానీ జస్టిస్ మురళీధర్ విషయంలో అలా జరగకపోవడం గమనార్హం.

కాగా-మురళీధర్ ట్రాన్స్ ఫర్ ని ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఖండించింది. సుప్రీంకోర్టు కొలీజియం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ అసోసియేషన్ డిమాండ్ చేసింది. బుధవారం..ఢిల్లీ హింసపై దాఖలైన పిటిషన్లను విచారించిన సందర్భంగా ఈ న్యాయమూర్తి.. నగరంలో కొనసాగుతున్న హింసాకాండను, అల్లర్లను అరికట్టేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కపిల్ మిశ్రా, అనురాగ్ ఠాకూర్, అభయ్ వర్మ, పర్వేష్ వర్మ వంటి బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాల తాలూకు వీడియోలను చూశారు. ఈ నలుగురు నేతలపై ఎఫ్ ఐ ఆర్ లు దాఖలు చేయాలని పోలీసులకు సూచించారు. ఈ దేశంలో 1984 లో సంభవించినటువంటి అల్లర్లు మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పైగా ఢిల్లీ అల్లర్లపై స్టేటస్ రిపోర్టును గురువారమే సమర్పించాలని నగర పోలీసు చీఫ్ ను ఆయన ఆదేశించారు. అటు జస్టిస్ మురళీధర్ బదిలీని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇది షాకింగ్ నిర్ణయం అన్నారు. ఈ దేశంలో జుడీషియరీ పట్ల కోట్లాది ప్రజలకు గల నమ్మకాన్ని ఇది వమ్ము చేస్తోందని, ఈ నిర్ణయం సిగ్గుచేటని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: ఇదేనా మీ తీరు ? ఢిల్లీ పోలీసులతీరుపై హైకోర్టు మండిపాటు