Andhra Pradeh: ఏపీలో న్యూస్ఛానెల్స్ ప్రసారాలు పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్లో టీవీ9 ప్రసారాన్ని నిలిపివేసిన నేపథ్యంలో సదరు ఛానెల్ నిరాటంకంగా ప్రసారం చేయడంలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కాగా ఏపీలో ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా న్యూస్ఛానెల్స్ని బ్లాక్ చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబడుతూ చరిత్రాత్మక ఉత్తర్వు వెలువరించిందని NBF అభినందించింది.
ఏపీలో న్యూస్ఛానెల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై NBF హర్షం వ్యక్తం చేసింది. TV9, సాక్షి, ఎన్టీవీ న్యూస్ ఛానెల్స్ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ 15 మల్టీ సిస్టమ్ ఆపరేటర్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఏపీలో ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా న్యూస్ఛానల్స్ని బ్లాక్ చేయడాన్ని తప్పుబడుతూ చారిత్రక ఉత్తర్వు వెలువడింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన భావప్రకటన స్వేచ్ఛాహక్కును ఈ ఉత్తర్వు చాటిచెప్పింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి పారదర్శకమైన మీడియా అవసరమని హైకోర్టు జోక్యం చాటిచెప్పింది. ఏపీ ప్రజలు విస్తృతమైన వార్తలు, అభిప్రాయాలను తెలుసుకోవడానికి న్యూస్ చానల్స్ని తక్షణం పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది.
అటు ట్రాయ్ నిబంధనల ప్రకారం ఛానల్స్ ప్రసారాలు ఆపేయడం చట్టవిరుద్ధమనీ, అలా ఆపితే.. అది డిస్ట్రిబ్యూషన్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అని NBF అభిప్రాయపడింది. రాజ్యాంగ హక్కులను కాపాడుతూ, స్వేచ్ఛాయుత-స్వతంత్ర మీడియాను ప్రోత్సహించినందుకు ఢిల్లీ హైకోర్టుకు NBF అభినందనలు తెలిపింది. పాత్రికేయుల హక్కులు, స్వేచ్ఛాయుత సమాచార వాతావరణాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నామని NBF స్పష్టం చేసింది. ఇకపై కూడా.. ఇలా ఛానెల్స్ ప్రసారాల నిలిపివేతలను అడ్డుకోడానికి ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు చర్యలు తీసుకోవాలని NBF ఆకాంక్షించింది. అనవసర జోక్యాలు లేకుండా మీడియా ఛానెల్స్ పనిచేసే వాతావరణం కల్పించాలని NBF విజ్ఞప్తి చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..