ఉక్కిరి బిక్కిరి.. క్యాపిటిల్‌ సిటీలో ఊపిరి పీల్చేదెలా..? కిరణ్ బేడీ ఏమన్నారంటే..

ఓవైపు మంచు మబ్బు..మరోవైపు పొలుష్యన్‌.. క్యాపిటిల్‌ సిటీ ఊపిరికి ఎసురు పెడుతున్నాయి. గాలిపీల్చడమే గగనం అనేలా కాలుష్య పోటుతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరవుతోంది.ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ గ్రాఫ్‌ అంతకంతకూ పెరుగుతోంది. అలాగే ఆందోళనలు కూడా. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఉక్కిరి బిక్కిరి.. క్యాపిటిల్‌ సిటీలో ఊపిరి పీల్చేదెలా..? కిరణ్ బేడీ ఏమన్నారంటే..
Delhi Air Pollution

Updated on: Nov 29, 2025 | 7:50 AM

దేశమంతా చలిచంపేస్తుందని వణికిపోతుంటే దేశరాజధాని మాత్రం కమ్ముకున్న కాలుష్య మేఘాలతో హడలిపోతుంది. తప్పుడు లెక్కలతో పొల్యూషన్‌ తీవ్రతను తక్కువ చేసి చూపిస్తున్నారని ఇప్పటికే యువత,ఢిల్లీవాసుల నిరవధిక ఆందోళనలు చేస్తున్నారు.

సగటు జీవులు, సామ్యానుల ఆవేదన మాత్రమే కాదు ప్రముఖులది కూడా అదే మాట.. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఢిల్లీ పొల్యూషన్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఏరియాలో AQI 587కి చేరిందని, ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవాలని కోరారు కిరణ్‌ బేడీ ట్వీట్‌ చేశారు.

ఇక ఢిల్లీ కాలుష్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు CJI సీజేఐ సూర్యకాంత్‌. పొల్యూషన్‌ కారణంగా బయటకు వెళ్లాలంటేనే ఢిల్లీవాసులు హడలిపోతున్నారన్నారు. అదే రీజన్‌తో తాను కూడా వాకింగ్‌ మానేశానన్నారు. కాలుష్యంపై అత్యవసరంగా విచారణ జరపాలన్న పిటీషన్‌ను విచారించిన సందర్భంగా CJI ఈ వ్యాఖ్యలు చేశారు. కాలుష్య నివారణకు దీర్ఘకాలిక పరిష్కారం అవసరమన్నారు. తదుపరి విచారణను డిసెంబర్ 1 కు వాయిదా వేశారు.

మరోవైపు పొల్యూషన్ కేంద్రంగా పాలిటిక్స్‌ జోరందుకున్నాయి. ఢిల్లీ కాలుష్యంపై కేంద్రాన్ని ప్రశ్నించారు విపక్ష నేత రాహుల్ గాంధీ . పిల్లలు ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారని , ప్రధాని కాలుష్యంపై ఎలా మౌనంగా ఉంటారని ప్రశ్నించారు రాహుల్‌. కేంద్రం ఎందుకు అత్యవసర ప్రణాళిక ప్రకటించడం లేదన్నారు. వాయు కాలుష్యంపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్‌ చేశారు.

ఢిల్లీలో పొల్యూషన్‌ పీక్స్‌కు చేరింది. సర్కార్‌ వారి లెక్కల ప్రకారం కాలుష్య తీవ్రత 384 పాయింట్లు. అవి తప్పుడు లెక్కలు. కాలుష్య తీవ్రత అంతకు మించి వుందని సామాన్యులతో పాటు ప్రముఖులు గళమెత్తుతున్నారు. పంజాబ్, హర్యానా, UP రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన, పరిశ్రమల కాలుష్యం ఢిల్లీని కమ్మేస్తోంది. ఓవైపు కాలుష్యం మరోవైపు పొగమంచు వల్ల విజిబిలిటీ బాగా తగ్గిందంటున్నారు ఢిల్లీ వాసులు.