9 మంది ప్రాణాలు తీసిన ఏసీ.. అందరూ నిద్రమత్తులో ఉండగా..

దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్‌లో AC పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రమాదంలో 4 అంతస్తుల భవనం అగ్నికి ఆహుతైంది. అగ్నిమాపక సిబ్బంది 15 మందిని రక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

9 మంది ప్రాణాలు తీసిన ఏసీ.. అందరూ నిద్రమత్తులో ఉండగా..
Delhi Shahdara Building Fir

Updated on: May 03, 2026 | 9:41 AM

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో అమర్చిన ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలడంతో మంటలు చెలరేగి 9మంది మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం వివేక్ విహార్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. సోమవారం తెల్లవారు జామున వివేక్‌ విహార్‌లో 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి.. ఏసీ పేలడంతో రెండో అంతస్తులో మొదలైన మంటలు.. మొత్తం బిల్డింగ్ కు వ్యాపించాయి.. ఈ ఘటనలో 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. 14 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పారు.

అగ్ని ప్రమాదం జరిగినట్టుగా సమాచారం రావడంతో తెల్లవారుజామున 3:30కే ఫైర్‌ ఫైటర్స్‌ రంగంలోకి దిగినట్లు అధికారులు తెలిపారు. 80 మంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. ఓపక్క చీకటి.. మరోపక్క మంటలు, పొగ కారణంగా లోపల ఉన్న వారిని కాపాడడానికి చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే.. 15 మందిని బయటకు తేగలిగారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇంట్లో అమర్చిన ఏసీ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయని.. క్షణాల్లోనే మంటలు మొత్తం వ్యాపించాయని.. దీంతో అక్కడున్న వారు బయటకు రాలేకపోయారని పోలీసులు తెలిపారు. తొమ్మిది మంది బయటకు రాలేక అగ్నికి ఆహుతయ్యారన్నారు. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us