
న్యూఢిల్లీ, మే 15: నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పెద్ద విజయం సాధించింది. ఈ కుంభకోణంలో మాస్టర్ మైండ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పి.వి. కులకర్ణిని పుణెలో అధికారులు అరెస్టు చేశారు. నీట్ 2026 పేపర్ తయారీలో కీలక పాత్ర పోషించింది కులకర్ణి కావడం గమనార్హం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రక్రియను దుర్వినియోగం చేసి ప్రశ్నపత్రాలను సంపాదించడంలో కులకర్ణి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. లీకైన ప్రశ్నపత్రాలు, వాటి సమాధానాలను కాపీ చేసి గుర్తుంచుకునేలా అతను తన నివాసంలోనే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాడు. ఈ భారీ పేపర్ లీక్ నెట్వర్క్కు సంబంధించి CBI ఇప్పటివరకు మొత్తం ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో మరిన్ని కీలక సాక్ష్యాధారాలను సేకరించేందుకు దర్యాప్తు సంస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తోంది. ఈ అరెస్టుతో లీకేజీ వెనుక ఉన్న మరికొన్ని రహస్యాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సూత్రధారి అయిన పి.వి. కులకర్ణి పూణేలో కెమిస్ట్రీ లెక్చరర్. పి.వి. కులకర్ణి స్వస్థలం మహారాష్ట్రలోని లాతూర్. ఎన్టీఏ పరీక్షల ప్రక్రియలో పి.వి. కులకర్ణి పాలుపంచుకున్నాడు. పీవీ కులకర్ణి వద్ద ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయని సీబీఐ గుర్తించింది. ఏప్రిల్ చివరి వారంలో నిందితురాలైన మనీషా వాఘ్మారే సహాయంతో కొంతమంది విద్యార్థులను కులకర్ణి సమీకరించారు. మనీషా వాఘ్మారేను నిన్న సీబీఐ అరెస్టు చేసింది. పూణేలోని తన ఇంట్లో విద్యార్థుల కోసం ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్న కులకర్ణి.. తన కోచింగ్ తరగతులలో విద్యార్థులకు ప్రశ్నలు, వాటి ఆప్షన్లు సరైన సమాధానాలను డిక్టేట్ చేసేవారనీ సీబీఐ గుర్తించింది.
విద్యార్థులు నోట్బుక్లలో రాసుకున్న ప్రశ్నల్లో మే 3న జరిగిన అసలు నీట్-యూజీ పరీక్ష పత్రంలోని ప్రశ్నలతో అవే ప్రశ్నలు పూర్తిగా సరిపోలాయని విచారణలో వెల్లడించింది. నీట్ పేపర్ లీక్ కేసులో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. అనేక ముఖ్యమైన పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లను సీబీఐ స్వాధీనం చేసుకుంది. సీబీఐ స్వాధీనం చేసుకున్న పరికరాలకు కొనసాగుతున్న ఫోరెన్సిక్, సాంకేతిక పరీక్షలు. విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యా విభాగం నుండి అందిన ఫిర్యాదు మేరకు మే 12 న పేపర్ లీక్ కేసును నమోదు చేసిన సిబిఐ. ఇప్పటివరకు, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే అహల్యానగర్లలో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసింది. నిందితులలో ఐదుగురిని కోర్టులో హాజరుపరిచి, 7 రోజుల పోలీసు రిమాండ్కు తీసుకుంది. ఇద్దరు నిందితులను ట్రాన్సిట్ రిమాండ్పై పోలీసులు ఢిల్లీకి తీసుకువస్తున్నారు. కెమిస్ట్రీ పేపర్ లీక్ మూల కారకులు, ప్రశ్నాపత్రం విద్యార్థులను చేరవేసిన మధ్యవర్తులు ఎవరో దర్యాప్తులో ఇప్పుడు వెల్లడైందని చెబుతోన్న సీబీఐ. కులకర్ణి ప్రత్యేక తరగతుల కోచింగ్ కోసం విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు తీసుకున్నారని సీబీఐ దర్యాప్తులో బట్టబయలైంది. నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందని సీబీఐ పేర్కొంది.
నీట్ పేపర్ లీక్ కేసులో దేశ వ్యాప్తంగా ప్రకంపనలు చుట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసలు సూత్రదారిని CBI శుక్రవారం అరెస్ట్ చేసింది. మరోవైపు లాతూర్లో రెండో రోజు సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. రిటైర్డ్ ప్రొఫెసర్ను అదుపులోకి తీసుకున్న CBI.. కోచింగ్ సెంటర్ల టీచర్లు, సిబ్బందిపై ప్రశ్నలు సందిస్తుంది.
మరోవైపు 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ స్కామ్పై కేంద్రప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం ప్రకటించింది. జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుమని కేంద్రం ప్రకటించింది. పేపర్ లీకేజీ దుమారం తర్వాత ఈనెల 3వ తేదీనాటి పరీక్ష రద్దయింది. ఈ వ్యవహారంపై CBI దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఐదుగురు నిందితులను ఢిల్లీ కోర్టు ఏడురోజుల CBI కస్టడీకి ఇచ్చింది. పరిస్థితుల్లో రీఎగ్జామ్ నిర్వహణపై కేంద్రప్రభుత్వం అనుమతి తీసుకున్నామని NTA ట్వీట్ చేసింది.
జూన్ 14కల్లా నీట్ యూజీ అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు అందుతాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. పరీక్ష సమయాన్ని మరో 15 నిమిషాలు పెంచుతున్నట్టు చెప్పారాయన.
వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ బేస్డ్గా ఆన్లైన్ నీట్ పరీక్ష ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.