BJP in Rajya Sabha: రాజ్యసభలో చరిత్ర సృష్టించిన బీజేపీ… తొలిసారిగా 100కి చేరిన సభ్యుల సంఖ్య

దేశంలో ఓ వైపు కాంగ్రెస్‌ ప్రాభవం తగ్గిపోతోన్న క్రమంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి BJP తన బలాన్ని పుంజుకుంటోంది. పలు రాష్ట్రాల్లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న భారతీయ జనతా పార్టీ.. కేంద్రంలోనూ స్పష్టమైన మెజారిటీతో కొనసాగుతోంది.

BJP in Rajya Sabha: రాజ్యసభలో చరిత్ర సృష్టించిన బీజేపీ... తొలిసారిగా 100కి చేరిన సభ్యుల సంఖ్య
Rajya Sabha

Updated on: Apr 01, 2022 | 9:21 PM

BJP in Rajya Sabha: దేశంలో ఓ వైపు కాంగ్రెస్‌(Congress) ప్రాభవం తగ్గిపోతోన్న క్రమంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) తన బలాన్ని పుంజుకుంటోంది. పలు రాష్ట్రాల్లో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న భారతీయ జనతా పార్టీ.. కేంద్రంలోనూ స్పష్టమైన మెజారిటీతో కొనసాగుతోంది. గురువారం జరిగిన ఎన్నికల్లో అస్సాం, త్రిపుర, నాగాలాండ్‌లో ఒక్కో సీటును గెలుచుకున్న బీజేపీ తన చరిత్రలో తొలిసారిగా రాజ్యసభ(Rajya Sabha)లో 100 మంది సభ్యుల మైలురాయిని సాధించింది. ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఇటీవల జరిగిన ద్వైవార్షిక ఎన్నికలలో, బిజెపి పంజాబ్ నుండి ఒక సీటును కోల్పోయింది. అయితే మూడు ఈశాన్య రాష్ట్రాలతో పాటు హిమాచల్ ప్రదేశ్ నుండి ఒక్కొక్క సీటును గెలుచుకుంది. బీజేపీ చరిత్రలోనే ఈ ఘనత సాధించడం తొలిసారి కాగా.. 1990 నుంచి ఏ పార్టీకి రాజ్యసభలో ఇంతటి మెజారిటీ లేకపోవడం గమనార్హం.

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్యసభ స్థానాలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఇందులో పంజాబ్‌లోని ఐదు స్థానాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ కైవసం చేసుకోగా అస్సాం, త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లోని ఒక్కో రాజ్యసభ స్థానాల్లో భాజపా మిత్రపక్షాలు విజయం సాధించాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఐదు స్థానాలు మాత్రం విపక్షాల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అయితే ఇంతవరకు రాజ్యసభ వెబ్‌సైట్ కొత్త జాబితాను ఇంకా తెలియజేయలేదు. ఇప్పుడున్న 97 సీట్లకు కొత్త ఎన్నికల్లో వచ్చిన మూడు సీట్లను కలుపుకుంటే బీజేపీ సంఖ్య 100కి చేరుతుంది. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ లోక్‌సభలో మెజారిటీ సాధించినప్పటి నుంచి 245 మంది సభ్యులున్న రాజ్యసభలో మెజారిటీకి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, బీజేపీ సభ్యుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2014లో రాజ్యసభలో బీజేపీ బలం 55 కాగా, ఆ పార్టీ పలు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోంది.

చివరిసారిగా 1990లో ఒక పార్టీకి 100 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. 1990 ద్వైవార్షిక ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. అప్పటి అధికార కాంగ్రెస్‌కు అంతకుముందు 108 మంది సభ్యులు ఉన్నారు. రాష్ట్రాలలో అధికారం కోల్పోయి సంకీర్ణ శకం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ పతనం కొనసాగింది.

అయితే, మరో 52 స్థానాలకు త్వరలో పోలింగ్ జరగనుండగా, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ తగులుతుందని భావిస్తున్నందున కాషాయ పార్టీ పట్టు బలహీనపడవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఖాళీగా ఉన్న 11 స్థానాల్లో కనీసం ఎనిమిది స్థానాలను గెలుచుకోగలిగిన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్‌ నుంచి పదవీ విరమణ పొందిన 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఐదుగురు బీజేపీకి చెందిన వారే కావడం విశేషం. అయితే ఈసారి మాత్రం ఎనిమిదింటిలో గెలుస్తామనే ధీమాతో ఉంది భారతీయ జనతా పార్టీ.

మొత్తం 245 సభ్యులు కలిగిన రాజ్యసభలో భాజపా మెజారిటీ తక్కువగానే ఉన్నప్పటికీ.. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2014లో బీజేపీ బలం 55గా ఉండగా.. ఆయా రాష్ట్రాల్లో వరుస విజయాలతో రాజ్యసభలోనూ తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. తాజా ఎన్నికలతో సెంచరీ కొట్టిన బీజేపీ.. మూడు దశాబ్దాల తర్వాత రాజ్యసభలో 100 సీట్ల మార్కును దాటిన పార్టీగా రికార్డు నెలకొల్పింది. 1990లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ బలం 99కి తగ్గిపోయింది. అలా అప్పటి నుంచి మొదలైన కాంగ్రెస్‌ పతనం సంకీర్ణ ప్రభుత్వం నాటికి మరింత దిగజారింది.

Read Also….  UP CM Yogi Humanity: మానవత్వం చాటుకున్న ముఖ్యమంత్రి.. అంబులెన్స్ కోసం కాన్వాయ్ ఆపేసిన సీఎం!

 

Loading...
Unable to load recommendations.
Follow Us