
బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఓ వివాహ వేడుకలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆనందంగా సాగుతున్న పెళ్లి వేడుక ఒక్కసారిగా రక్తసిక్తంగా మారి, ఒక డాన్సర్ ప్రాణాలను బలిగొంది. కేవలం తమకు నచ్చిన పాటను ప్లే చేయలేదన్న కోపంతో కొందరు యువకులు వేదికపై ప్రదర్శన ఇస్తున్న డాన్సర్పై కాల్పులు జరపడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.
గోపాల్గంజ్ జిల్లా కటేయా పోలీస్ స్టేషన్ పరిధిలోని పటోహ్వా-జమున్హా గ్రామంలో గురువారం (జూన్ 18) అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మహేంద్ర కుష్వాహా ఇంట్లో వివాహ వేడుక సందర్భంగా ఆర్కెస్ట్రా, మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని డియోరియా జిల్లా నుంచి వచ్చిన వివాహ బృందం పాల్గొంటుండగా, వేదికపై 32 ఏళ్ల సోను గౌర్ డాన్స్ చేస్తున్నారు.
ఈ సమయంలో గ్రామానికి చెందిన కొందరు యువకులు తమకు ఇష్టమైన పాటను ప్లే చేయాలని పట్టుబట్టారు. ఆ పాటను వెంటనే పెట్టకపోవడంతో డాన్సర్తో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటికే ఈ వివాదం ఘర్షణగా మారింది. ఆగ్రహానికి గురైన ఓ యువకుడు పిస్టల్తో సోను గౌర్ కడుపులో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల శబ్దంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. వేడుకకు వచ్చిన మహిళలు, పిల్లలు ప్రాణభయంతో పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన సోనును సమీప ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడు థర్డ్ జెండర్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గత ఏడేళ్లుగా డ్యాన్స్ ప్రోగ్రామ్లలో పాల్గొంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లిదండ్రుల మరణం తర్వాత ముగ్గురు పిల్లలు, తమ్ముడి బాధ్యతలను సోనే చూసుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అతని మరణంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు గుర్తుతెలియని యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక పాట విషయంలో మొదలైన చిన్న వివాదం ఓ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చడంతో స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..