Bihar Politics: బీహార్ సర్కారును కుదిపేస్తున్న మరో వివాదం.. ఈ ఫోటోలోనే అంతా ఉంది..
Bihar Minister Tej Pratap Yadav: బీహార్ అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న తేజ్ ప్రతాప్.. గురువారం తన శాఖకు సంబంధించి తొలిసారిగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో..
Bihar Politics: బీహార్ సర్కారును మరో కొత్త వివాదం కుదిపేస్తోంది. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారికి కేబినెట్లో చోటు కల్పించడంపై ఇప్పటికే సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ఓ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఆ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి కార్తికేయ సింగ్కు అరెస్ట్ వారెంట్ జారీ కావడం రాజకీయ దుమారంరేపడం తెలిసిందే. మంత్రిపై క్రిమినల్ కేసు ఉన్న విషయం తనకు తెలియదని సీఎం నితీశ్ కుమార్ వివరణ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరికొందరు మంత్రుల అడ్డగోలు వ్యవహారం ఒక్కోటి వెలుగుచూస్తున్నాయి. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యవహార తీరు వివాదాస్పదంగా మారింది.
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న తేజ్ ప్రతాప్.. గురువారం తన శాఖకు సంబంధించి తొలిసారిగా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తన సోదరి మీసా భారతి భర్త శైలేష్ కుమార్ను కూడా తేజ్ ప్రతాప్ కూర్చోబెట్టుకోవడం వివాదాస్పం అవుతోంది. సమీక్షా సమావేశంలో శైలేష్ కుమార్ పాల్గొన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది. ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేని శైలేష్ కుమార్ అధికారిక సమీక్షా సమావేశానికి ఎలా హాజరవుతారంటూ విపక్ష బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఆర్జేడీకి చెందిన అందరు మంత్రులకంటే శైలేష్ కుమార్ చాలా తెలివైన వారని.. ఆయన ఆశీస్సులు ఉంటే తేజ్ ప్రతాప్ బీహార్లో బెస్ట్ మినిస్టర్గా నిలుస్తారంటూ ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ ధ్వజమెత్తారు. బీహార్లో మళ్లీ ఆటవిక రాజ్యం మొదలయ్యిందని ఆరోపించారు.
बिहार के वन एवं पर्यावरण मंत्री श्री तेज प्रताप यादव को कोई हल्के में ना ले। हमारे भाई शैलेश जी भी साथ बैठे हैं।
मेरा दावा है कि राजद के सभी मंत्रियों से शैलेशजी ज्यादा समझदार- ज्ञानी- टैलेंटेड जरूर हैं। शैलेश भाई का आशीर्वाद रहा तो तेज प्रताप सबसे बेस्ट मिनिस्टर साबित होंगे। pic.twitter.com/vXjnDd2e7b
— Nikhil Anand (@NikhilAnandBJP) August 18, 2022
అయితే తేజ్ ప్రతాప్ యాదవ్పై వస్తున్న విమర్శలను ఆర్జేడీ అధికార ప్రతినిధి శశి యాదవ్ తోసిపుచ్చారు. ఒక పనిమీద తేజ్ ప్రతాప్ను కలిసేందుకు శైలేష్ కుమార్ మంత్రి కార్యాలయానికి వెళ్లారని చెప్పారు. మంత్రి అధికారులతో సమీక్షా సమావేశంలో ఉండటంతో అక్కడ కూర్చొని వెయిట్ చేయాలని ఎవరో సూచించారని చెప్పుకొచ్చారు. ఆ మేరకు శైలేష్ కుమార్ అక్కడ కూర్చుకున్నట్లు తెలిపారు. శైలేష్ కుమార్ మంత్రి ఛాంబర్కు వెళ్లడం నేరమా? అంటూ ప్రశ్నించారు. అధికారులకు శైలేష్ కుమార్ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.
ఇటీవల బీజేపీతో తెగతెంపులు చేసుకున్న నితీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జట్టు కట్టి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. నితీశ్ కుమార్ ఎనిమిదో సారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టగా.. ఆర్డీడీ నేత తేజస్వి యాదవ్ రెండోసారి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యారు. వరుస హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి