
బీహార్లోని బెట్టియా జిల్లాలో శుక్రవారం (ఆగస్టు 21) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లౌరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని పరావ్ టోలా బంకట్వా గ్రామం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బెట్టియా-లౌరియా ప్రధాన రహదారిపై రోడ్డు పక్కన నిర్వహిస్తున్న ఆర్కెస్ట్రా కార్యక్రమంలోకి అదుపుతప్పిన బస్సు దూసుకెళ్లడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
పిల్లల ‘ఛతియార్’ కార్యక్రమం సందర్భంగా రోడ్డు పక్కన ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు. అదే సమయంలో లౌరియా నుంచి బెట్టియా వైపు వెళ్తున్న ఓ బస్సు అతివేగంగా వస్తుంది. ఎదురుగా గ్యాస్ సిలిండర్లతో వస్తున్న ట్రక్కును తప్పించుకునే ప్రయత్నంలో అదుపు తప్పింది. డ్రైవర్ బస్సును నియంత్రించలేకపోవడంతో అది నేరుగా ఆర్కెస్ట్రా కార్యక్రమం వద్ద ఉన్న జనసమూహంలోకి దూసుకెళ్లింది.
బస్సు ఢీకొనడంతో పలువురు తీవ్రంగా గాయపడగా, ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను సంజయ్ మహతో, భోలా దుబే, బహదూర్ మహతో, దేవేంద్ర దుబే, చంగూర్ రామ్గా గుర్తించారు. మృతుల్లో ఛతియార్ వేడుకకు హాజరైన చిన్నారి తండ్రి దేవేంద్ర దుబే కూడా ఉండటం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలంలో తీవ్ర గందరగోళం నెలకొంది. స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం ఐదుగురు గాయపడిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. బస్సు వేగం, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొనగా, స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..