BJP: ఆ 10 కారణాలే యూపీలో బీజేపీ కొంప ముంచాయా..

| Edited By: Srikar T

Jul 18, 2024 | 9:36 PM

లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) కేవలం 240 స్థానాలకే పరిమితం కావడంలో ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో తగిలిన ఎదురుదెబ్బలే కారణం. మహారాష్ట్ర సంగతెలా ఉన్నా.. కమలదళానికి కంచుకోటలా మారిందని భావించిన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం ఆ పార్టీ అధినేతలను తీవ్రంగా కలచివేసింది. ఢిల్లీ పీఠంపై కూర్చోవాలంటే ముందు యూపీ గడ్డపై గెలవాలి అన్నది దేశ రాజకీయాల్లో ఉన్న నానుడి.

BJP: ఆ 10 కారణాలే యూపీలో బీజేపీ కొంప ముంచాయా..
Telangana Bjp
Follow us on

లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) కేవలం 240 స్థానాలకే పరిమితం కావడంలో ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల్లో తగిలిన ఎదురుదెబ్బలే కారణం. మహారాష్ట్ర సంగతెలా ఉన్నా.. కమలదళానికి కంచుకోటలా మారిందని భావించిన ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం ఆ పార్టీ అధినేతలను తీవ్రంగా కలచివేసింది. ఢిల్లీ పీఠంపై కూర్చోవాలంటే ముందు యూపీ గడ్డపై గెలవాలి అన్నది దేశ రాజకీయాల్లో ఉన్న నానుడి. అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు కల్గిన పెద్ద రాష్ట్రలో ఏ పార్టీ / కూటమి ఎక్కువ సీట్లు సాధిస్తే.. వారు అధికారం చేపట్టగల్గుతారు. ఎక్కువ సీట్లు సాధించకపోతే.. సంకీర్ణ ప్రభుత్వమే శరణ్యం.

ఈసారి అదే జరిగింది. 2014లో 80 సీట్లలో బీజేపీ సొంతంగానే 71 సీట్లు గెలుచుకోగా, మిత్రపక్షాలతో కలిపి మొత్తం 73 సీట్లతో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కమలదళం, 2019లో సొంతంగా 62 సీట్లు, మిత్రపక్షాలతో కలుపుకుని 64 సీట్లతో మొత్తానికి ఆధిపత్యాన్ని కొనసాగించగల్గింది. కానీ తాజాగా జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కేవలం 33 స్థానాలకే పరిమితమైంది. రెండేళ్ల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పార్టీ మంచి పనితీరు కనబరిచినప్పటికీ, బలమైన కోటలో ఇంత భారీ నష్టాన్ని చవిచూడాల్సివచ్చింది. ఇందుకు దారితీసిన పరిస్థితులు ఏంటి అన్నది తెలుసుకుంటేనే లోపాలు, తప్పిదాలను సరిదిద్దుకుని ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో అనేక రూపాల్లో సేకరించిన ఫీడ్ బ్యాక్ ప్రకారం 10 కారణాలు అత్యంత ప్రభావం చూపాయని, పలు వర్గాల ప్రజలను బీజేపీకి దూరం చేశాయని తెలిసింది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి గత రెండు రోజులుగా ఢిల్లీలో ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాతో జరిగిన సమావేశంలో ఫీడ్‌బ్యాక్ నివేదికను అందించారు. నివేదికపై అగ్రనేతలతో సవివరంగా చర్చించారు. దాదాపు 40 వేల మంది పార్టీ కార్యకర్తలతో మాట్లాడి భూపేంద్ర చౌదరి ఈ నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. 15 పేజీల నివేదికలో ఓటమికి 10 ప్రధాన కారణాలను పేర్కొన్నారు.

యూపీలో బీజేపీ ఓటమికి 10 కారణాలు:

  1.  నివేదికలో ఉదహరించిన ప్రధాన కారణం గత ఆరేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షల్లో నిరంతర పేపర్ లీకేజీ. పేపర్‌ లీక్‌ సమస్య కారణంగా యువ ఓటర్లు పార్టీకి దూరమయ్యారు.
  2. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్టు కార్మికుల నియామకాల్లో జనరల్‌ కేటగిరీకి చెందిన వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం రెండో కారణం. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అంటూ విపక్షాలు చేసిన దుష్ప్రచారానికి ఈ అంశం బలం చేకూర్చింది. ఫలితంగా రిజర్వేషన్ ఫలాలు పొందే ఎస్సీ-ఎస్టీ, ఓబీసీ వర్గాల్లో అనుమానాలు ఏర్పడి, బీజేపీకి పడాల్సిన ఓట్లలో గండి పడింది.
  3. రాష్ట్ర ప్రభుత్వంపై పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తి కూడా పనితీరు సరిగా లేకపోవడానికి కారణమని నివేదికలో పేర్కొన్నారు. అంతకుముందు ఆదివారం (జూలై 14) లక్నోలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటోందని, అధికారులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, మంత్రులు నిస్సహాయంగా ఉన్నారని సమావేశానికి హాజరైన పలువురు నేతలు ఆరోపించారు. అప్పటి నుంచి యూపీ బీజేపీలో కొనసాగుతున్న విభేదాలు తెరపైకి వచ్చాయి.
  4. రాష్ట్ర అధ్యక్షుడి నివేదికలో రాష్ట్ర అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయితే, వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా బీజేపీ కార్యకర్తలు ఇదే ఆరోపణ చేశారు.
  5. ఓటమికి రాజ్‌పుత్ సామాజికవర్గంలో నెలకొన్న ఆగ్రహం కూడా ఒక కారణమని నివేదికలో పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు యూపీలో బీజేపీపై రాజ్‌పుత్‌ సామాజికవర్గం ఆగ్రహంతో ఉన్నట్టు విస్తృతంగా కథనాలు కూడా వచ్చాయి. పశ్చిమ యూపీలో, ఠాకూర్ వర్గం నేతలు కొదరు తాము బీజేపీని బహిష్కరిస్తున్నట్లు కూడా ప్రకటించారు. రాజ్‌పుత్‌ల ఆగ్రహం కూడా పార్టీని దెబ్బతీసిందని నివేదికలో పేర్కొన్నారు.
  6. రాజ్యాంగాన్ని మారుస్తామంటూ కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలు సైతం యూపీలో నష్టానికి కారణమయ్యాయి. సమాజ్‌వాదీ (SP) పార్టీ, కాంగ్రెస్ ఈ అంశాన్ని తమ ఆయుధాలుగా మలచుకున్నాయి. ఎన్నికలలో పూర్తిగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించాయి. రాహుల్ గాంధీ తన ప్రతి సమావేశానికి రాజ్యాంగం కాపీని ప్రదర్శించారు. మొత్తంగా కొన్ని వర్గాల్లో భయాందోళనలు సృష్టించగలిగారు. బీజేపీకి నష్టం కలిగించారు.
  7. ముందస్తుగా టికెట్ల పంపిణీ కారణంగా 6, 7వ దశ ఓటింగ్ వరకు కార్యకర్తల్లో ఉత్సాహం సన్నగిల్లిపోయింది. దీంతో ఆ పార్టీకి ఓట్లు తగ్గాయన్నది మరో విశ్లేషణ. లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం ఏడు దశల్లో ఉత్తరప్రదేశ్‌లోని స్థానాలకు పోలింగ్ జరిగింది. ఎన్నికలను పొడిగించడం వల్ల కార్యకర్తల్లో ఉత్సాహం కొరవడిందని నివేదిక పేర్కొంది.
  8. పార్టీ నివేదికలో అగ్నివీర్ యోజన కూడా పెద్ద అంశంగా మారింది. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ ఎన్నికల సందర్భంగా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. బీజేపీ నేతలు అప్పట్లో ఈ పథకాన్ని సమర్థించినా.. ఇప్పుడు ఓటమికి ఓ కారణంగా భావిస్తున్నారు.
  9. పాత పెన్షన్ స్కీమ్ (OPS) అంశం ప్రభుత్వ అధికారులను శాసిస్తోందని, ఎన్నికలలో వారి ఆగ్రహాన్ని భాజపా భరించాల్సి వచ్చిందని భూపేంద్ర చౌదరి నివేదిక పేర్కొంది.
  10. కింది స్థాయిలో ఎన్నికల అధికారులు బీజేపీకి చెందిన ప్రధాన ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించారని నివేదిక పేర్కొంది. దాదాపు అన్ని స్థానాల్లో 30-40 వేల మంది బీజేపీ కోర్ ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతయ్యాయని, ఆ కారణంగా ఎన్నికలలో నష్టం జరిగిందని నివేదికలో ఉంది.

ఉత్తరప్రదేశ్‌లో ఓటమికి గల కారణాలపై రూపొందించిన ఈ నివేదికలో.. ఈ కారణాలన్నింటినీ వివరిస్తూ.. పార్టీ సకాలంలో సరిదిద్దాలని సూచించారు. అలాగే పరిపాలనలో ప్రభుత్వ అధికారులు, పార్టీ కార్యకర్తల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలని కూడా పేర్కొన్నారు.

దూరమైన కొన్ని వర్గాలు:

గత పదేళ్లుగా బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన కొన్ని సామాజికవర్గాలు ఈ ఎన్నికల్లో పార్టీకి దూరమయ్యారని నివేదిక పేర్కొంది. యాదవేతర ఓబీసీ వర్గాల్లో గట్టి పట్టున్న బీజేపీ, ఈ సారి ఆ వర్గాల్లో కుర్మి, కోయిరి, మౌర్య, శాక్య, లోథ్ వర్గాల ఓట్లలో చాలావరకు గండి పడింది. బహుజన్ సమాజ్ పార్టీ (BSP) ఓటు బ్యాంకులో 10 శాతం ఓట్లు తగ్గాయని, అలాగే బీజేపీకి 2019లో తగ్గిన దళిత ఓట్లలో మూడో వంతు మాత్రమే వచ్చాయని నివేదిక పేర్కొంది. ఒకప్పుడు బీఎస్పీకి సాంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న జాతవ్, ఖాతిక్, పాసీ సామాజికవర్గాల్లో బీజేపీ గత పదేళ్లలో మంచి పట్టు సాధించింది. కానీ 2024లో ఆ వర్గాలు పార్టీకి దూరమైనట్టు తేలింది. ఫలితంగా కాంగ్రెస్-సమాజ్‌వాదీ కూటమి విశేషంగా లబ్ది పొందిందని నివేదికలో ప్రస్తావించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..