ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువులు మృతి

మహారాష్ట్ర అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం జరిగింది. NICUలో మంటలు చెలరేగడంతో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో 39 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది పలువురిని సురక్షితంగా తరలించారు.

ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువులు మృతి
Hospital Fire Accident

Updated on: Aug 24, 2026 | 7:40 AM

మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రి మూడో అంతస్తులోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగం (NICU)లో మంటలు చెలరేగడంతో ముగ్గురు నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆసుపత్రిలో తీవ్ర విషాదం నెలకొంది.

సమాచారం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో NICUలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటిలేటర్‌కు సంబంధించిన సాంకేతిక లోపం, అనుకోని పేలుడు లేదా షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి అసలు కారణం అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే నిర్ధారణ కానుంది.

వార్డులో 39 మంది శిశువులు

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో NICUలో మొత్తం 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ వార్డులో వ్యాపించడంతో అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిస్థితిని గుర్తించిన వెంటనే సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సహాయక చర్యలు చేపట్టారు. వార్డులో చిక్కుకున్న శిశువులను ఒక్కొక్కరిగా బయటకు తరలించారు. మంటలు, పొగ మరింతగా వ్యాపించకముందే పలువురు చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

రక్షించిన నవజాత శిశువుల్లో తీవ్ర వైద్య సంరక్షణ అవసరమైన ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదంలో ముగ్గురు నవజాత శిశువులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే పుట్టిన చిన్నారులు మంటల్లో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ప్రమాదంపై దర్యాప్తు

NICUలో మంటలు ఎలా చెలరేగాయనే అంశంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా వెంటిలేటర్‌కు సంబంధించిన సాంకేతిక లోపం లేదా షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో పరిశీలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఆసుపత్రిలో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు, విద్యుత్‌ వ్యవస్థ పనితీరుపైనా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన ఆసుపత్రుల్లో, ముఖ్యంగా నవజాత శిశువుల కోసం ఏర్పాటు చేసిన NICUలలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు, విద్యుత్‌ పరికరాల నిర్వహణ ఎంత కీలకమో మరోసారి గుర్తుచేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us