సవరించిన పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లను ప్రేరేపిస్తున్నారని, రైళ్లను తగులబెడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. (ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసాకాండలో 43 మంది మృతి చెందారు). కానీ మీరిలా ఆందోళనలు చేసినా ప్రయోజనం లేదని షా.. దీదీని ఉద్దేశించి అన్నారు. ‘మమతా దీదీ ! సీఏఏ అమలు కాకుండా మీరు ఆపలేరు’ అని ఆయన పేర్కొన్నారు. బెంగాల్ లో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని బీజేపీ తరఫున ఆదివారం కోల్ కతాలో ప్రచారం ప్రారంభించారు అమిత్ షా. మీరు శరణార్ధుల ప్రయోజనాలను, వారి సంక్షేమాన్ని నీరుగారుస్తున్నారని ఆరోపించిన ఆయన.. అసలు మీరు చొరబాటుదారుల గురించే ఆలోచిస్తారని విమర్శించారు. మీరు శరణార్థులను భయపెడుతున్నారు.. వారిని తప్పుదారి పట్టిస్తున్నారు.. పొరుగు దేశాలకు వలస పోయిన హిందువులు ఆ దేశాల్లో అత్యాచారాలకు, హత్యలకు గురవుతున్నారు.. అలాంటివారిని రక్షించి వారికి భారత పౌరసత్వం ఇవ్వవలసిన అవసరం లేదా అని అమిత్ షా ప్రశ్నించారు.
వచ్ఛే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ 18 సీట్లు గెలుచుకుందని, అందుకు ఈ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని షా పేర్కొన్నారు. మేం డిపాజిట్లు కోల్పోతామని మమత అంటున్నారని, కానీ ఈ రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా ‘బీజేపీ ఓట్లు’ ఉన్నాయని ఆయన చెప్పారు.