Punjab Next CM: పంజాబ్ సీఎంగా ఆమె పేరు ప్రతిపాదించిన రాహుల్ గాంధీ.. తిరస్కరించిన కాంగ్రెస్ నాయకురాలు?
Ambika Soni: సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పంబాజ్ తదుపరి సీఎం ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతోంది.
Ambika Soni: సీఎం పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో పంజాబ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పంబాజ్ తదుపరి సీఎం ఎవరన్న సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎంగా పీసీసీ చీఫ్ సిద్ధూను అంగీకరించేది లేదని అమరీందర్ సింగ్ ఇప్పటికే తేల్చిచెప్పారు. సిద్ధూకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తో సన్నిహిత సంబంధాలున్నాయని.. ఆయన సీఎం కావడం దేశ భద్రతకు విఘాతమని శనివారంనాడు తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో కొత్త సీఎం ఎంపిక కోసం కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది. పంజాబ్ సీఎం పదవిని అంబికా సోనీ చేపట్టాలని రాహుల్ గాంధీ ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను అంబికా సోని తిరస్కరించినట్లు తెలుస్తోంది. పంజాబ్ సీఎంగా సిక్కు వ్యక్తినే నియమించాలని పార్టీ అధిష్టానానికి సూచిస్తూ.. ఆమె సీఎం పదవిని తిరస్కరించారన్న టాక్ వినిపిస్తోంది. సిక్కు వ్యక్తి సీఎంగా లేకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం కలుగుతుందని ఆమె రాహుల్ గాంధీకి స్పష్టంచేసినట్లు సమాచారం.
కొత్త సీఎంగా ఎవరిని నియమించాలన్న విషయంలో పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలను కాంగ్రెస్ అధిష్టాన పరిశీలకులు హరీష్ రావత్, అజయ్ మకేన్ తెలుసుకుంటున్నారు. ఇప్పటికే వారు ఈ పని మొదలుపెట్టారు. పార్టీ ఎమ్మెల్యేలతో శనివారం వారు సమావేశమయ్యారు. కొత్త సీఎం ఎంపికను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎమ్మెల్యేలతో విడివిడిగానూ మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయాలను పార్టీ అధిష్టానానికి తెలియజేయనున్నారు.
కొత్త సీఎం పదవి రేసులో పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాకర్, ప్రస్తుత పంజాబ్ పీసీసీ చీఫ్ సిద్ధూ, మంత్రి సుఖ్జీందర్ సింగ్ అందరికంటే ఉన్నట్లు తెలుస్తోంది. అటు త్రిప్త్ రాజిందర్ సింగ్, కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బాజ్వా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కొత్త ముఖ్యమంత్రి పేరును పార్టీ హైకమాండ్ ఆదివారంనాడు రాత్రికల్లా ఖరారు చేస్తుందని పంజాబ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పవన్ గోయల్ తెలిపారు.
తన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ సిద్ధూ పేరును కొత్త సీఎంగా పార్టీ అధిష్టానం ఖరారు చేస్తే అమరీందర్ సింగ్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారుతోంది. అదే సమయంలో అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో పార్టీ హైకమాండ్ తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని కొందరు పంజాబ్ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పార్టీ హైకమాండ్ ముందే స్పందించి విభేదాలను పరిష్కరించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదంటున్నారు. కొత్త సీఎం వచ్చే ఎన్నికలనాటి కల్లా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ శ్రేణులను కలవాల్సి ఉంటుందని అంటున్నారు.
Also Read..