32 సెకన్లలోనే అంతా ఫినిష్‌.. బయటికొచ్చిన కొత్త వీడియో! టేకాఫ్‌ నుంచి బిల్డింగ్‌పై కూలే వరకు..

అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమానం టేకాఫ్ అయిన వెంటనే కూలిపోయింది. 241 మంది ప్రయాణికులు, సిబ్బంది మరణించారు. కేవలం ఒకరు మాత్రమే బతికారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రమాదాన్ని స్పష్టంగా చూపిస్తుంది. టాటా గ్రూప్ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది.

32 సెకన్లలోనే అంతా ఫినిష్‌.. బయటికొచ్చిన కొత్త వీడియో! టేకాఫ్‌ నుంచి బిల్డింగ్‌పై కూలే వరకు..
Air India

Updated on: Jun 12, 2025 | 9:14 PM

అహ్మదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి లండన్‌కు బయలుదేరిన విమానం.. టేకాఫ్‌ అయిన నిమిషం వ్యవధిలోనే కుప్పకూలిపోయింది. ఎయిర్‌పోర్ట్‌ అతి సమీపంలో ఓ కాలేజీ హాస్టల్‌ బిల్డింగ్‌పై కూలింది. ఆ తర్వాత భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో విమానంలో 242 మంది ఉండగా 241 మంది మరణించారు. అలాగే మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్‌లో ఉన్న విద్యార్థులు కూడా కొంతమంది మృతి చెందారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మధ్యాహ్నం ఒక వీడియో బయటికి వచ్చింది. అయితే తాజాగా ఎయిర్‌ పోర్టులో ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో పూర్తి దృశ్యం రికార్డ్‌ అయింది. ఆ వీడియో తాజాగా బయటికి వచ్చింది.

విమానం టేకాఫ్‌ అయి గాల్లోకి ఎగుతున్న క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పూర్తిగా పైకి వెళ్లకుండా.. కొద్ది సెకన్లలోనే కిందికి దిగుతూ.. కాలేజ్‌ బిల్డింగ్‌పై కూలిపోయింది. ఆ వెంటనే భారీ పేలుడు సంభవించింది. దట్టమైన పొగ కమ్ముకుంది. అలా చూస్తుండగానే.. కేవలం 32 సెకన్లలోనే ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం పూర్తిగా భస్మం అయిపోయింది. కొన్ని నిమిషాల ముందు ఎంతో సంతోషంగా ఉన్న ప్రయాణికులు, పైలెట్లు, సిబ్బంది.. జీవితాల్లో గాల్లో కలిసిపోయాయి.

ఈ విషాద ఘటన విమానంలో ఉన్న 241 మందితో పాటు విద్యార్థుల ప్రాణాలు కూడా బలిగొంది. ఈ ప్రమాదం నుంచి కేవలం ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. 11ఏ సీటు బుక్‌ చేసుకొని.. లండన్‌ వెళ్తున్న రమేష్‌ అనే వ్యక్తి అదృష్టం కొద్ది బతికిబట్టకట్టాడు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ఇప్పటికే టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ప్రకటించారు. అలాగే గాయపడిన వారి వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని, ప్రమాదంలో దెబ్బతిన్న మెడికల్‌ కాలేజ్‌ బిల్డింగ్‌ను కూడా పునఃనిర్మిస్తామని కూడా వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..