
ఒక్కోసారి కొంతమంది అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతారు. మరికొందరు ఫుల్లుగా తాగి పడిపోతారు. వాళ్లు ఎక్కడ పడిపోయారో లేచి చూస్తే వారికి కూడా అర్థం కాదు. కొన్నిసార్లు ఇలా ఎవరైన స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఎవరూ పట్టించుకోకపోతే వాళ్ల ప్రాణాలకు కూడా గ్యారంటీ ఉండదు. కానీ ఓ మహిళ మాత్రం స్పృహ తప్పిపోయి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి బయటపడింది. ఆమె స్పృహ తప్పి పట్టాలపై పడిపోయినప్పటికీ గూడ్స్ రైలు ఆ ట్రాక్పై నుంచి వెళ్లినా ఆమె సురక్షితంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్లో బాబుపుర్ అనే గ్రామానికి చెందిన హరి ప్యారీ(40) అనే మహిళ మందులు కొనేందుకు సహవర్ అనే రైల్వేస్టేషన్ వైపు వెళ్లింది.
అయితే ఈ క్రమంలోనే ఆమెకు సడెన్గా తలతిరిగింది. దీంతో స్పృహ తప్పిపోయి ఆ రైలు పట్టాలపైనే పడిపోయింది. ఆమెను కొంతమంది గమనించారు. కాపాడేందుకు పరిగెత్తుకొచ్చారు. కానీ అప్పటికే ఆమె పడిపోయిన ట్రాక్ లైన్లో ఓ గూడ్స్ రైలు వచ్చింది. ఇక చేసేదేమీ లేక ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గూడ్స్ రైలు ఆమె ఉన్న ట్రాక్పై దూసుకొచ్చింది. కొన్ని బోగీలు వెళ్లేసరికి ఆమెకి మెళుకువ వచ్చింది. అక్కడున్న స్థానికులు ఆమె కాళ్ల, చెతులు కదపకుండా అలానే పడుకోవాలంటూ కేకలు వేశారు. ఇక ఆ రైలు పూర్తిగా వెళ్లిపోయాక ఆమెను పట్టాలపై నుంచి పక్కకు తీసుకొచ్చారు. అయితే హరి ప్యారీకి స్పల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..