
26 ఎముకలు, 33 కీళ్ళు, 100 కంటే ఎక్కువ కండరాలతో నిర్మితమైన మన పాదాలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. రోజంతా బూట్లు ధరించడం వల్ల వచ్చే చెమట, బయటి దుమ్ము, ధూళి పాదాలపై బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతాయి. వీటిని శుభ్రం చేయకుండా పడుకోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అథ్లెట్లు, విద్యార్థులు మరియు షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అసలు పాదాలను కడగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? నిపుణులు ఇచ్చే సలహాలేంటి? ఇప్పుడు చూద్దాం.
1. మంచం సూక్ష్మక్రిములమయం కాకుండా..
మనం బయట తిరిగినప్పుడు లేదా ఇంట్లోనే నడిచినప్పుడు పాదాలకు అంటుకునే ధూళి, కంటికి కనిపించని క్రిములు పడకగదిలోకి చేరుతాయి. పడుకునే ముందు పాదాలు కడగకపోతే, ఆ బ్యాక్టీరియా పరుపుపై చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
2. ఇన్ఫెక్షన్ల ముప్పు తప్పదు
మురికి పాదాలతో నిద్రపోవడం వల్ల అథ్లెట్స్ ఫుట్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీనివల్ల పాదాల మధ్య దురద, ఎరుపు, చర్మం పొట్టులా రావడం, బొబ్బలు ఎక్కడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పగుళ్లను నిర్లక్ష్యం చేస్తే అవి తీవ్రమైన నొప్పికి, కొన్నిసార్లు సర్జరీకి కూడా దారితీయవచ్చు.
3. మధుమేహ వ్యాధిగ్రస్తులకు హెచ్చరిక
డయాబెటిస్ ఉన్నవారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరికి పాదాలకు చిన్న గాయం లేదా ఇన్ఫెక్షన్ సోకినా అది త్వరగా తగ్గదు. అందుకే వారు పడుకునే ముందు పాదాలను తప్పనిసరిగా శుభ్రం చేసుకుని, ఏవైనా మార్పులు ఉన్నాయేమో గమనించాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
రోజుకు రెండుసార్లు: బయటి నుండి వచ్చిన వెంటనే పడుకునే ముందు పాదాలను బాగా కడగాలి.
గోరువెచ్చని నీరు: వారానికి కనీసం రెండుసార్లు గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టండి. ఇది కండరాల అలసటను తగ్గించి, ప్రశాంతమైన నిద్రను ఇస్తుంది.
పొడిగా ఉంచండి: కడిగిన తర్వాత పాదాలను, ముఖ్యంగా వేళ్ల మధ్య భాగాన్ని శుభ్రమైన తువ్వాలుతో తుడిచి పొడిగా ఉంచుకోవాలి.