
బరువు తగ్గాలనుకునేవారికి, డయాబెటిస్ ఉన్నవారికి, ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలనుకునేవారికి అనువైన అల్పాహారం.. మొలకెత్తిన జొన్నలతో తయారు చేసిన గుగ్గిళ్లు (Sprouted Jonna Guggillu). నోటికి రుచిగా ఉండటమే కాకుండా మీ ఒంట్లో రోగాలు కూడా ఇట్టే మాయం అవుతాయి.
ముందుగా జొన్నలను 2–3 సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత 8–10 గంటలు లేదా రాత్రంతా నీటిలో నానబెట్టాలి. నానిన జొన్నల నీటిని వంపేయాలి. ఒక గుడ్డలో లేదా మొలకల డబ్బాలో కట్టి 24 గంటలు ఉంచాలి. మధ్యలో ఒకసారి నీళ్లు చల్లి తేమ ఉండేలా చూడాలి. చిన్న మొలకలు వచ్చిన తర్వాత వాడాలి. మొలకలు వచ్చిన జొన్నల్లో పోషకాలు పెరుగుతాయి. జీర్ణం కూడా సులభమవుతుంది. మొలకెత్తిన జొన్నలు, పల్లీలు కుక్కర్లో వేయాలి. జొన్నలు మునిగేంత నీరు పోయాలి. కొద్దిగా ఉప్పు వేయాలి. 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత నీటిని వంపి పక్కన పెట్టాలి.
తాలింపు కోసం.. పాన్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేయాలి. ఇవి బంగారు రంగు వచ్చాక ఎండు మిర్చి, కరివేపాకు వేయాలి. అందులో అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేయాలి. దీనిని 2–3 నిమిషాలు వేయించాలి. తర్వాత ఉడికించిన జొన్నలు, పల్లీలు వేసి అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. 5 నిమిషాలు చిన్న మంటపై వేయించాలి. చివర్లో తురిమిన కొబ్బరి, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే రుచికరమైన జొన్న గుగ్గిల్లు రెడీ అయినట్లే.
ఇలా చేస్తే మొలకలలోని పోషకాలు అలాగే ఉంటాయి. ఈ గుగ్గిల్లు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలుగుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే ఈ గుగ్గిల్లు ఇవ్వవచ్చు. రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా సహాయపడుతుంది. జొన్నలు + పల్లీలు + మొలకలు కలయిక వల్ల మంచి ప్రోటీన్ లభిస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది. గట్ హెల్త్ మెరుగుపడుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు ఉదయం ఒక మధ్యస్థ గిన్నె (200–250 గ్రాములు) తీసుకుంటే సరిపోతుంది. ఉదయం అల్పాహారంగా ఒక గిన్నె జొన్న గుగ్గిళ్లు తింటే కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. డైట్లో ఉన్నవారు దీనితో పాటు టీ/కాఫీకి బదులుగా మజ్జిగ లేదా గ్రీన్ టీ తీసుకోవచ్చు. వారానికి 3–4 సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి