ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. మహిళల్లో కూడా ఎన్నో ఆందోళనలు ఉంటాయి. తీసుకునే ఆహారం మొదలు, జీవన శైలి వరకు అన్నింటిలో మార్పులు చేసుకుంటారు. ఇక గర్భం దాల్చిన సమయంలో ఎన్నో అపోహలు వెంటాడుతుంటాయి. అలాంటి వాటిలో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గర్భిణీలు కారం ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల శిశువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా స్పైసీ ఫుడ్ తీసుకుంటే కడుపులోని శిశువు కళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, అంధత్వానికి దారి తీసే అవకాశం కూడా ఉందని కొందరు విశ్వసిస్తుంటారు. కారం ఎక్కువగా ఉన్న ఫుడ్ను తీసుకోవడం వల్ల గర్భస్రావం అవుతుందని కూడా నమ్ముతుంటారు. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇది పూర్తిగా తప్పుడు వాదన అని అంటున్నారు. నిజానికి ఇలాంటి సమస్యలు ఏవి ఉండవు. అయితే గర్భిణీలు ఎక్కువ కారం తీసుకుంటే మాత్రం జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గర్బిణీల్లో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. అజీర్తి, గుండెల్లో మంట వంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అందుకే ఈ సమయంలో స్పైసీ ఫుడ్ను అధికంగా తీసుకోవడం మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు.
ఇక స్పైసీ ఫుడ్ తీసుకుంటే గుండెలో మంట కలిగిన భావన పెరుగుతుందని అంటున్నారు. అయితే గర్భధారణ సమయంలో కొన్ని ఆహారాలు తినడం వల్ల ఉమ్మనీరు రుచి మారుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ఇది మీ శిశువు యొక్క రుచి మొగ్గలను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. అయితే ఇది శిశువు ఆరోగ్యంపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపదని నిపుణులు అంటున్నారు.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..