
ప్రస్తుత రోజుల్లో నీరు, కాలుష్యం కారణంగా చాలా మంది చుండ్రు, జుట్టు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి ఉపశమనం కోసం కొంతమంది మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడితే, మరికొందరు సంప్రదాయ ఇంటి చిట్కాలను పాటిస్తారు. మీకు కూడా ఇంటి చిట్కాలు వాడే అలవాటు ఉంటే ఒక్కసారి ఇది ట్రై చేయండి. మీరు జుట్టు కోసం రెగ్యులర్గా వాడే కొబ్బరినూనెలో కాస్తంత పటిక పొడిని కలిపి తలకు రాసుకోండి. ఈ మిశ్రమం తలలోని అదనపు జిడ్డును తొలగించి, స్కాల్ప్ను శుభ్రంగా ఉంచుతూ చుండ్రును తగ్గించడంలో సహాయపడుతుంది.
కొబ్బరినూనె, పటిక మిశ్రమం తయారీ విధానం ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ఒక చిన్న పాత్ర తీసుకొని అందులో కొబ్బరినూనెను గోరువెచ్చగా వేడి చేయాలి. ఇప్పుడు పటికను తీసుకొని దాన్ని మెత్తటి పొడిగా దంచి, ఆ పౌడర్ను గోరువెచ్చని కొబ్బరినూనెలో వేసి బాగా కలపాలి. అది కొద్దిగా చల్లారిన తర్వాత స్కాల్ప్పై రాసి చేతివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా 30 నిమిషాల పాటు ఉంచి, ఆ తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
కొబ్బరినూనె, పటిక మిశ్రమం ప్రయోజనాలు ఈ మిశ్రమంలో వాడే కొబ్బరినూనె జుట్టు కుదుళ్లకు లోతైన పోషణను ఇస్తుంది. అలాగే పటికలో యాంటీసెప్టిక్, ఆస్ట్రింజెంట్ గుణాలు ఉంటాయి. ఇది స్కాల్ప్లోని అధిక జిడ్డును తొలగించి, చుండ్రుకు కారణమయ్యే ఫంగస్ను తగ్గిస్తుంది. అంతేకాదు దురద, మంట నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఇది వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొందరి చర్మానికి పటిక పడకపోవచ్చు. కాబట్టి తలకు పూర్తిగా రాసే ముందు చేతిపై లేదా తలలోని చిన్న భాగంలో ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. వారానికి 1 నుంచి 2 సార్లు వాడితే సరిపోతుంది, అంతకు మించి వాడటం మంచిది కాదు. ఒకవేళ మీకు చుండ్రు, దురద ఎక్కువగా ఉండి తలపై ఎరుపుదనం కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్ను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.