
ఆన్లైన్ షాపింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా రిటైల్ రంగం తీరు మారిపోయింది. నచ్చిన వస్తువును స్మార్ట్ఫోన్లో ఒక్క క్లిక్తో ఇంటికి తెప్పించుకునే వెసులుబాటు ఉండటంతో, చాలామంది మాల్స్కు వెళ్లి నేరుగా కొనుగోలు చేసే అనుభవాలను కోల్పోయారు. ఉరుకులు పరుగుల జీవితంలో సమయం లేక కొందరు, ఆకర్షణీయమైన డిస్కౌంట్లకు ఆశపడి మరికొందరు ఆన్లైన్ షాపింగ్ వైపు మొగ్గు చూపారు. అయితే, ఇప్పుడు ట్రెండ్ మళ్లీ మారుతోంది. డిజిటల్ యుగంలో పుట్టి పెరిగిన నేటి తరం యువత (Gen-Z), ఆన్లైన్ స్క్రీన్లకు స్వస్తి పలికి మళ్లీ ప్రత్యక్ష షాపింగ్ అనుభూతిని కోరుకుంటోంది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ కథనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా జెన్-Z షాపర్లు మళ్లీ మాల్స్ వైపు క్యూ కడుతున్నారు.
నేటి యువత కేవలం వస్తువును కొనడమే కాకుండా, ఆ ప్రక్రియలో లభించే అనుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తోంది. మాల్స్కు వెళ్లడం వల్ల నచ్చిన దుస్తులను లేదా వస్తువులను నేరుగా చూసి, తాకి, నాణ్యతను పరీక్షించి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీనికి తోడు అక్కడ లభించే ఎంటర్టైన్మెంట్, స్నేహితులతో కలిసి చేసే హడావుడి వారికి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అంతేకాకుండా, ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫోటోల కోసం అందమైన లొకేషన్లు వెతికే జెన్-Z యువతకు, మాల్స్లోని ఆకర్షణీయమైన డిజైన్లు అద్భుతమైన కంటెంట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి. అందుకే ఆన్లైన్ కంటే నేరుగా స్టోర్కు వెళ్లి కొనుగోలు చేయడానికే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు.
గత ఏడాది గణాంకాలను పరిశీలిస్తే, 18-24 ఏళ్ల వయసువారు తమ సాధారణ అవసరాల కోసం చేసే కొనుగోళ్లలో ఏకంగా 62 శాతం నేరుగా స్టోర్లకు వెళ్లి చేసినవే కావడం గమనార్హం. యువతలో మారుతున్న ఈ ఆసక్తులను గమనించిన మాల్ యజమానులు కూడా తమ వ్యూహాలను మారుస్తున్నారు. మాల్స్లో కేవలం దుకాణాలు మాత్రమే కాకుండా, అత్యుత్తమ రెస్టారెంట్లు, ఫిట్నెస్ సెంటర్లు, మ్యూజిక్ ఈవెంట్లు మరియు ఇన్స్టాగ్రామ్ ఫోటోలకు అనువైన ప్రత్యేక సెట్టింగులను ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా మాల్స్కు వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. జెన్-Z లో కనిపిస్తున్న ఈ సరికొత్త ధోరణి రాబోయే రోజుల్లో రిటైల్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మనిషికి మనిషికి మధ్య ఉండే సామాజిక అనుబంధం టెక్నాలజీ కంటే గొప్పదని ఈ ట్రెండ్ మరోసారి నిరూపిస్తోంది.