పీరియడ్స్ మొదలైన అమ్మాయిలు తప్పనిసరిగా ఇది తినండి అమ్మా.. ఆరోగ్యానికి చాలా మంచిది..

పీరియడ్స్ సమయంలో వచ్చే నడుమునొప్పి, నీరసం తగ్గించి, రక్తహీనతను నివారించడానికి, ఎముకలను దృఢం చేయడానికి మన పెద్దలు చేసే సంప్రదాయ తీపి వంటకం సున్ని సంగటి. మినుములు, బ్రౌన్ రైస్, తాటి బెల్లం, నువ్వుల నూనెతో చేసే ఈ బలవర్ధకమైన ఆహారం ఆడపిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందరూ తినదగిన ఈ స్వీట్ తయారీ సులువు.

పీరియడ్స్ మొదలైన అమ్మాయిలు తప్పనిసరిగా ఇది తినండి అమ్మా.. ఆరోగ్యానికి చాలా మంచిది..
Traditional Indian Sweet

Updated on: Jul 09, 2026 | 11:50 AM

ఆడపిల్లలలో పీరియడ్స్ మొదలైన తర్వాత వారి ఆరోగ్యం, బలం చాలా ముఖ్యం. నడుము, ఎముకలు దృఢంగా ఉండటానికి, పీరియడ్స్ వల్ల వచ్చే రక్తహీనతను పోగొట్టి ఆరోగ్యంగా ఉండటానికి పూర్వ కాలంలో మన పెద్దలు ప్రత్యేక శ్రద్ధతో తయారు చేసే ఒక తియ్యటి, బలవర్ధకమైన వంటకం సున్ని సంగటి. ఈ సాంప్రదాయ వంటకం ఆడవారికి మాత్రమే కాకుండా ఇంట్లో అందరూ తినదగినది. సున్ని సంగటి తయారీకి కావలసిన పదార్థాలు, వాటి తయారీ విధానం ఇక్కడ వివరంగా ఉంది.

ముందుగా, అరకప్పు మినుములను తీసుకొని గిన్నెలో వేసి శుభ్రంగా కడగాలి. డస్ట్ అంతా పోయేలా నీటితో కడిగిన తర్వాత, నీళ్లన్నీ పూర్తిగా వంచేసి ఒక శుభ్రమైన బట్టపై వేసి తడిలేకుండా తుడవాలి. వీటిని ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదు. అదే విధంగా, మరొక గిన్నెలో అరకప్పు పాలిష్ చేయని బ్రౌన్ రైస్‌ను తీసుకొని కడిగి, నీళ్లు తీసేసి బట్టపై తుడిచి సిద్ధం చేసుకోవాలి. తరువాత, స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పాన్ పెట్టి, మినుములను వేసి లో ఫ్లేమ్‌లో నిరంతరం కలుపుతూ లోపలి వరకు వేగేలా నెమ్మదిగా వేయించాలి. కమ్మటి వాసన వచ్చేవరకు వేయించిన తర్వాత, కొన్ని మినుములను తీసి క్రష్ చేసి చూస్తే అవి గోల్డెన్ కలర్‌లో వేగి ఉండాలి. ఇప్పుడు బ్రౌన్ రైస్‌ను కూడా అదే పాన్‌లో వేసి, చక్కగా వేగి రంగు మారి, కమ్మటి వాసన వచ్చేవరకు లో ఫ్లేమ్‌లోనే వేయించాలి. వేయించిన మినుములు, బియ్యం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

సున్నుండల పిండి కంటే కొంచెం బరకగా లేదా బాగా మెత్తగా అయినా చేసుకోవచ్చు. ఈ స్వీట్ కోసం తాటి బెల్లం వాడటం వల్ల ఆడవాళ్లలో పీరియడ్స్ వల్ల వచ్చే రక్తహీనత పోగొట్టి రక్తం బాగా పట్టడానికి, ఎముకల బలానికి, చర్మం గ్లో అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఒక కప్పు తాటి బెల్లాన్ని గిన్నెలో తీసుకొని, రెండు కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్‌లో బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత, ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టి, బెల్లం నీళ్లను వడకట్టి కడాయిలో పోయాలి. బెల్లం నీళ్లు మరగడం మొదలవ్వగానే చిటికెడు ఉప్పు వేసి, లో ఫ్లేమ్‌లో ఉంచి, సిద్ధం చేసుకున్న పిండిని ఒక చేత్తో వేసుకుంటూ, మరో చేత్తో ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. తరువాత, కట్టె గానుగ నుంచి తీసిన స్వచ్ఛమైన నువ్వుల నూనెను అరకప్పు వరకు తీసుకోవాలి. పూర్వ కాలంలో పీరియడ్స్ మొదలైన ఆడపిల్లలకి నడుము, ఎముకలు దృఢంగా అవ్వడానికి ప్రతిరోజు చిన్న గిన్నెతో నువ్వుల నూనెను తాగించేవారు. అర కప్పు నువ్వుల నూనెను కొంచెం కొంచెంగా పిండి మిశ్రమంలో వేసుకుంటూ ఉండాలి. ఈ మిశ్రమం నూనెను పీల్చుకుంటూ ఉడుకుతుంది. మంట లో ఫ్లేమ్‌లోనే ఉంచి నిరంతరం కలుపుతూ ఉడికించాలి. ఈ దశలో తీపి సరిపోకపోతే, ఇంకొంచెం పొడి చేసిన బెల్లాన్ని కలుపుకోవచ్చు. నూనె ఎంత పడుతుందో చూసుకుంటూ వేసుకోవాలి. సాధారణంగా అరకప్పు వరకు నూనె పడుతుంది.

మిశ్రమం చక్కగా ఉడికి, నూనె కనిపించి, కడాయి నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు పావు స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి దాదాపు పదిహేను నిమిషాల సమయం పడుతుంది. ఈ సున్ని సంగటిలో వాడిన పొట్టు మినప్పప్పు, నువ్వుల నూనె వల్ల ఇది కొంచెం వగరుగా అనిపించవచ్చు, కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత తింటే రుచి ఇంకా బాగుంటుంది. చల్లారిన తర్వాత కొద్దిగా నువ్వుల నూనె లేదా నెయ్యి కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. రోజు కుదరకపోయినా, అప్పుడప్పుడూ అయినా ఆడపిల్లలతో పాటు ఇంట్లో అందరూ ఈ పాతకాలపు హెల్దీ స్వీట్‌ను తినడం వల్ల బలంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇది రక్తహీనతను నివారిస్తుంది, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. పీరియడ్స్ సమయంలో వచ్చే అసౌకర్యాలను తగ్గిస్తుంది.

మాజీ ఉపరాష్ట్రపతి నచ్చి, మెచ్చిన ఆరోగ్యకరమైన ‘వాసెన పోలి’ ఎలా చేయాలంటే.. 

 

Follow Us