
తెలంగాణ పండుగలంటేనే బంధుమిత్రులతో సందడి, దావత్, మసాలా ఘుమఘుమలు. ఫంక్షన్ అనే మాట వినగానే మటన్ లేని దావత్ అసంపూర్తిగా అనిపిస్తుంది. ముఖ్యంగా బోనాల సమయంలో అయితే ప్రతి ఇంట్లోనూ మటన్ వండాల్సిందే. ఆ మటన్ మసాలా వాసన ఊరంతా పరచుకుంటుంది. మరి అలాంటి ఈ స్పెషల్ డేస్ లో మటన్ కర్రీని రోటీన్ గా కాకుండా ఇంకాస్త టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ మారినేషన్.. ముందుగా మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి, పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం, నూనె వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇలా చేస్తే మసాలా మటన్ కు పట్టేసి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది.
మిక్సీ జార్ లో కొబ్బరి తురుము, దాల్చినచెక్క, అనాసపువ్వు, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు, ఎండు మిర్చి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయాలి.
కుక్కర్ వేడయ్యాక నూనె వేసి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంట తగ్గించి మరికొంత వేయించాలి. మారినేట్ చేసిన మటన్ ను కుక్కర్లో వేసి బాగా కలపాలి. మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి.
ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ను కుక్కర్లో వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మసాలా నుంచి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. తర్వాత కావలసినంత నీళ్లు పోసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి.
ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 8 నుంచి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ప్రెజర్ పూర్తిగా తగ్గిన తర్వాత మూత తీసి టేస్ట్ చెక్ చేయాలి. వేడిగా ఉండగానే అన్నం లేదా రోటీతో లాగించేయడమే. ఈ మటన్ కర్రీని నెయ్యితో తయారు చేస్తే రుచి మరింత అదిరిపోతుంది. ఈ రుచికరమైన బోనాల స్పెషల్ మటన్ కర్రీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.