
ఈ వంకాయ కూర ప్రత్యేకత అంతా మనం గ్రైండ్ చేసే మసాలా గ్రేవీ పొడిలోనే ఉంది. ముఖ్యంగా ఇందులో వాడే శనగపిండి, బియ్యం పిండి మెంతి పొడి మిశ్రమం కూరకు మంచి చిక్కదనాన్ని, సువాసనను ఇస్తుంది. ఒక్కసారి ఈ మసాలా తయారు చేసి పెట్టుకుంటే అన్ని రకాల కారపు పులుసులకు దీనిని వాడుకోవచ్చు. మరి ఈ ఘుమఘుమలాడే వంకాయ కారంపులుసు తయారీ విధానం అందులో వాడే ఆ సీక్రెట్ మసాలా గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు :
వంకాయలు: 5 (పొడవుగా తరిగినవి)
ఉల్లిపాయలు: 2
చింతపండు రసం: నిమ్మకాయ పరిమాణంలో
నువ్వుల నూనె: 3 టేబుల్ స్పూన్లు
తాలింపుకు: ఆవాలు, మెంతులు, సోంపు, కరివేపాకు, ఎండుమిర్చి
మసాలా దినుసులు: పసుపు, కారం, ఉప్పు, బెల్లం (చిన్న ముక్క)
గ్రైండింగ్ కోసం: టమోటాలు (2), వెల్లుల్లి (4 రెబ్బలు), కొబ్బరి (పావు కప్పు), జీలకర్ర, మిరియాలు (ఒక టీస్పూన్ చొప్పున).
స్పెషల్ గ్రేవీ మసాలా పొడి: కారం పొడి (1 tsp), ధనియాల పొడి (1 tsp), మిరియాల పొడి (1/2 tsp), జీలకర్ర పొడి (1/2 tsp), శనగపిండి, బియ్యం పిండి మరియు మెంతి పొడి (పావు టేబుల్ స్పూన్ చొప్పున).
తయారీ విధానం :
పాన్లో నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు, మెంతులు, సోంపు వేసి చిటపటలాడించాలి. తర్వాత ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించాలి.
తరిగిన వంకాయ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు నూనెలో మగ్గనివ్వాలి. ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసి తక్కువ మంట మీద వేయించాలి.
మిక్సీ జార్లో టమోటాలు, వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర, మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ను వంకాయల్లో వేసి కలపాలి. ఇప్పుడు చింతపండు రసం, గ్రేవీకి సరిపడా నీరు మరియు బెల్లం ముక్క వేయాలి.
సీక్రెట్ మసాలా: పైన పేర్కొన్న గ్రేవీ మసాలా పొడిని కూడా కలిపి, మూత పెట్టి పచ్చి వాసన పోయే వరకు 10 నిమిషాలు ఉడికించాలి. కూర దగ్గరపడి నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి.