
అప్పం దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వంటకం. ఇది పులియబెట్టిన బియ్యం, కొబ్బరితో తయారు చేస్తారు. అప్పం మధ్యలో మృదువుగా, మెత్తగా ఉండి, అంచుల వైపున క్రిస్పీగా ఉంటుంది. అప్పం కూరలు, చట్నీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్ లో ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ రెసిపీ. చేయడం కూడా చాలా సింపుల్. ఎలాగో చూద్దాం..
పచ్చి బియ్యం: 2 కప్పులు
తురిమిన కొబ్బరి: ½ కప్పు
వండిన అన్నం: 2 టేబుల్ స్పూన్లు
చక్కెర: 1 టేబుల్ స్పూన్
ఈస్ట్: ½ టీస్పూన్
రుచికి సరిపడా ఉప్పు
అవసరమైనంత నీరు
గ్రీసింగ్ కోసం నూనె
పచ్చి బియ్యాన్ని 4-5 గంటలు నీళ్లలో నానబెట్టాలి.
నీరు తీసేసి, తురిమిన కొబ్బరి, వండిన అన్నంతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలపాలి.
గోరువెచ్చని నీటిలో ఈస్ట్, చక్కెరను కరిగించాలి. అది నురుగుగా మారే వరకు అలా ఉంచాలి.
ఈ ఈస్ట్ ద్రావణాన్ని పిండిలో కలపాలి. ఉప్పు వేసి, మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి.
అప్పం పెనం (అప్పచట్టి) వేడి చేయాలి. కొద్దిగా నూనెతో గ్రీస్ చేయాలి. ఒక గరిటెడు పిండి వేసి, పెనంను తిప్పుతూ పిండిని పలుచగా పరచాలి.
2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. అంచులు కరకరలాడుతూ, మధ్యలో మెత్తగా మారుతుంది.
జాగ్రత్తగా తీసి, వేడిగా కూరలు, చికెన్ కర్రీతో తినవచ్చు.