
చాలా మంది ఏవో కారణాలతో బ్రేక్ ఫాస్ట్ మిస్ చేస్తుంటారు. కానీ, ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం నిద్రలేచిన వెంటనే శరీరం మళ్లీ క్రియాశీలంగా మారేందుకు శక్తి అవసరం అవుతుంది. ఈ సమయంలో అల్పాహారం తీసుకోకపోతే, శరీరం శక్తిని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తుంది. దీంతో మెటబాలిజం నెమ్మదించి రోజంతా అలసట, నీరసం కలగవచ్చు. ఉదయం వేళల్లో చురుకుదనం, ఉత్పాదకత తగ్గిపోవడానికి ఇది ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం దాటవేయడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుందని Harvard Health Publishing వెల్లడించింది.
చాలామంది అల్పాహారం మానేస్తే బరువు తగ్గుతామని భావిస్తారు. కానీ వాస్తవానికి దీని ఫలితం విరుద్ధంగా ఉండొచ్చు. ఉదయం ఆహారం తీసుకోకపోతే రోజంతా తీవ్రమైన ఆకలి వేస్తుంది. దీంతో మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో అతిగా తినడం, అధిక కేలరీలు ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్ వైపు ఆకర్షితులవడం జరుగుతుంది. అల్పాహారం మానేసే వారిలో మితిమీరిన స్నాక్స్ తీసుకునే అలవాటు ఎక్కువగా కనిపిస్తుందని International Journal of Community Medicine And Public Health పేర్కొంది. ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి దారితీస్తుంది.
అల్పాహారం తీసుకోకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఇన్సులిన్ నిరోధకత లేదా మధుమేహం ఉన్నవారిలో ఇది మరింత ప్రభావం చూపుతుంది. ఈ మార్పులు దీర్ఘకాలంలో టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచే అవకాశముంది.
అల్పాహారం దాటవేయడం గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, రక్తపోటు అధికమవడం, గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అల్పాహారం మానేసే వారిలో ఊబకాయం, అధిక రక్తపోటు, అననుకూల లిపిడ్ ప్రొఫైల్, డయాబెటిస్ వంటి కార్డియోమెటబాలిక్ ప్రమాదాలు ఉన్నట్లు National Library of Medicine అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మెదడు సమర్థంగా పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. అల్పాహారం తీసుకోకపోతే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, అప్రమత్తత తగ్గవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగుల్లో స్పందన వేగం తగ్గడం, చిరాకు పెరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇవి వారి పనితీరును ప్రభావితం చేయవచ్చు.
క్రమం తప్పకుండా అల్పాహారం మానేయడం వల్ల ఆకలి, ఒత్తిడిని నియంత్రించే కార్టిసాల్, గ్రెలిన్ వంటి హార్మోన్ల పనితీరులో మార్పులు వస్తాయి. ఉదయాన్నే ఒత్తిడి పెరగడం, ఆందోళన, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. దీర్ఘకాలంలో ఇది ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను కొనసాగించడం కష్టతరం చేస్తుంది.
ఇలాంటి వారు సమతుల్యమైన అల్పాహారం తీసుకోవడం ద్వారా శక్తి స్థాయిలు స్థిరంగా ఉంచుకుని, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.