
మారుతున్న ఆధునిక జీవనశైలిలో శరీరానికి అవసరమైన పోషకాలు లభించాలంటే నిత్యం పండ్లు తీసుకోవడం ఎంతో కీలకమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలామంది రోజూ ఒకే రకమైన పండు తింటూ ఉంటారు. ఏ ఒక్క పండు కూడా శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను, రోగనిరోధక శక్తిని ఒంటిచేత్తో అందించలేదు. అందుకే వారమంతా రకరకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి తగిన మోతాదులో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. ఇందుకోసం వారంలో ఏ రోజు ఏ పండ్లు తినాలో నిపుణులు ఓ ప్రత్యేక డైట్ చార్ట్ను రూపొందించారు.
సోమవారం నాడు ఆపిల్స్, అరటిపండ్లు తీసుకోవడం ఉత్తమం. ఆపిల్స్లో లభించే పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి రక్షణ ఇవ్వగా, అరటిపండ్లలోని పొటాషియం రోజంతా ఉత్తేజాన్ని అందిస్తుంది. వీటిని అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. ఇక మంగళవారం విటమిన్ సి సమృద్ధిగా ఉండే నారింజ, విటమిన్ ఎతో పాటు జీర్ణక్రియను మెరుగుపరిచే పాపైన్ ఎంజైమ్ కలిగిన బొప్పాయిని డైట్లో చేర్చుకోవాలి. బుధవారం నాటి ఆహారంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు కలిగిన దానిమ్మ గింజలతో పాటు అత్యధిక ఫైబర్, విటమిన్ సి అందించే బేరిపండ్లను తీసుకోవడం శరీర మెటబాలిజానికి ఎంతో మేలు చేస్తుంది.
గురువారం నాడు శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచేందుకు అధిక నీటి శాతం కలిగిన పుచ్చకాయను, అలాగే విటమిన్ సి, ఇ, ఫోలేట్, పొటాషియం పుష్కలంగా ఉండే కివీ పండును ఎంచుకోవాలి. శుక్రవారం ద్రాక్ష, పైనాపిల్ తినడం మంచిది. ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి తోడ్పడగా, పైనాపిల్లోని బ్రోమెలైన్ ఎంజైమ్ వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే వీటిని మితంగా తీసుకోవడం ముఖ్యం. వారాంతాలైన శని, ఆదివారాల్లో పోషకాలు, ఫైబర్ అధికంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్, పనస పండు, ఆప్రికాట్లను ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే పనస వంటి సహజ తీపి అధికంగా ఉండే పండ్లను మితంగా తీసుకోవాలని, ఏదైనా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహార మార్పులకు ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.