
వేసవి కాలం వచ్చిందంటే చాలు, మన ఇళ్లలో రకరకాల వడియాలు, పచ్చళ్లు, ఊరమిరపకాయల సందడి మొదలవుతుంది. అయితే, చల్ల మిరపకాయలు (ఊరమిరపకాయలు) అనగానే మనకు గుర్తొచ్చేది పెరుగు. కానీ, పెరుగు వాడకుండా, చుక్క మజ్జిగ కూడా లేకుండా ఎంతో రుచికరంగా, రెండేళ్ల పాటు నిలువ ఉండేలా చల్ల మిరపకాయలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
మధ్యాహ్నం వేడి వేడి అన్నంలోకి పప్పు చారు ఉన్నా, చారు ఉన్నా పక్కన నంజుకోవడానికి చల్ల మిరపకాయలు ఉంటే ఆ రుచే వేరు. సాధారణంగా పెరుగుతో చేసే మిరపకాయలు ఒక్కోసారి కడుపులో మంటను కలిగిస్తాయి. కానీ, కేవలం ధనియాలు, వాము, జీలకర్ర, నిమ్మరసంతో చేసే ఈ చల్ల మిరపకాయలు తింటే గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు అస్సలు రావు.
మొదటగా కారం లేని లావు మిరపకాయలను తీసుకోవాలి. వాటికి మధ్యలో గాట్లు పెట్టి సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు, వాము, జీలకర్ర, కల్లు ఉప్పును సమానంగా తీసుకుని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిని మిరపకాయల మీద వేసి, దానిపై తగినంత నిమ్మరసం పిండాలి. ఈ నిమ్మరసం, మసాలా పొడి మిరపకాయల లోపలికి వెళ్లి మంచి పులుపును, రుచిని ఇస్తుంది.
వీటిని ఒక రోజంతా మూత పెట్టి నాననివ్వాలి. ఆ తర్వాత ఒక పెద్ద ప్లేట్లో వేసి పైన పల్చని క్లాత్ కప్పి నాలుగైదు రోజుల పాటు ఎండలో బాగా ఎండనివ్వాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయలు ఎంతో క్రిస్పీగా తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా డబ్బాలో భద్రపరుచుకుంటే రెండు సంవత్సరాలైనా తాజాగా ఉంటాయి. తక్కువ నూనెలో దోరగా వేయించుకుని పప్పు అన్నంలోకి తింటే ఆ మజానే వేరు. ఈ వేసవిలో మీరు కూడా ఈ వెరైటీ మిరపకాయలను తప్పకుండా ప్రయత్నించండి!
Also Read: కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!