
వెండితెరపై తన గలగలా నవ్వుతో అందరినీ అలరించే నటి అర్చన పూరన్ సింగ్, ప్రస్తుతం తన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 63 ఏళ్ల వయసులో ఆమె బెంగళూరులోని ఒక ఆయుర్వేద వెల్నెస్ రిట్రీట్లో 15 రోజుల పాటు గడిపి తిరిగి వచ్చారు. ఈ పర్యటన తర్వాత తన జీవనశైలిలో సమూల మార్పులు చేసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తన పెద్ద కుమారుడు ఆర్యమాన్ సేథి యూట్యూబ్ వ్లాగ్లో మాట్లాడుతూ, ఆయుర్వేద నిపుణులు తనకు సూచించిన కఠినమైన రోజువారీ దినచర్య గురించి వివరించారు.
అర్చన పూరన్ సింగ్ ప్రస్తుతం తన ఆరోగ్య ప్రణాళికలో భాగంగా రాత్రి 7 గంటలకే భోజనం ముగిస్తున్నారు. రాత్రి 10 నుండి 11 గంటల మధ్య కచ్చితంగా నిద్రపోవాలని వైద్యులు ఆమెకు సూచించారు. సోషల్ మీడియాలో తన సాధారణ భోజనానికి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె పంచుకున్నారు. సాయంత్రం స్నాక్స్గా సోయా ఫిల్లింగ్తో చేసిన బియ్యం పిండి మోమోలను తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వయసులో శరీరాన్ని పునరుత్తేజం చేసుకోవడానికి ఆయుర్వేద పద్ధతులు ఎంతో అవసరమని ఆమె భావిస్తున్నారు. బెంగళూరులోని ఆ ప్రశాంత వాతావరణం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆమె పేర్కొన్నారు.
కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని బాధాకరమైన విషయాలను కూడా అర్చన మొదటిసారి పంచుకున్నారు. 1990ల చివరలో తనకు గర్భస్రావం జరిగిందని, ఆ సమయంలో తాను ఎంతో మానసిక వేదనకు గురయ్యానని తెలిపారు. 34 ఏళ్ల వయసులో ఆ సంఘటన జరగడంతో, మళ్ళీ తల్లిని అవుతానో లేదో అనే భయం తనను వెంటాడిందని ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో తన భర్త పర్మీత్ సేథి తనకు ఎంతో అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. తన తండ్రి మరణించిన సమయంలో తాను గర్భవతిగా ఉన్నానని, ఆ దుఃఖంలో కూడా తనకు ‘ఆలూ పూరీ’ తినాలని అనిపించేదని, ఆ వింత పరిస్థితిని అప్పట్లో అర్థం చేసుకోలేకపోయానని ఆమె వివరించారు.