
WHO, వరల్డ్ బ్యాంక్ మద్దతుతో పనిచేసే గ్లోబల్ ప్రిపేర్డ్నెస్ మానిటరింగ్ బోర్డ్ ‘ఏ వరల్డ్ ఆన్ ది ఎడ్జ్’ (ప్రపంచం ఓ అంచున నిలబడింది) పేరుతో ఒక కలవరపెట్టే నివేదికను విడుదల చేసింది. కోవిడ్ తర్వాత ప్రపంచ దేశాలు తమ ఆరోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తాయని అంతా భావించారు. కానీ వాస్తవానికి దేశాల మధ్య అంతర్జాతీయ సహకారం విపరీతంగా తగ్గిపోయింది. వ్యాక్సిన్ సమానత్వం కూలిపోయింది, ఆరోగ్య రంగానికి కేటాయించే నిధులు తగ్గాయి, పేద దేశాల వైద్య రంగాలు మరింత బలహీనపడ్డాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మరో కొత్త వైరస్ కనుక వస్తే ప్రపంచం మళ్లీ ఊహించని భారీ విధ్వంసాన్ని చూడాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ హెచ్చరికలు వస్తున్న సమయం కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. మధ్య ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా దేశాలలో ‘బుండిబుగ్యో’ అనే అరుదైన మరియు ప్రమాదకరమైన ఎబోలా స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త వేరియంట్ ఎంత వేగంగా వ్యాపిస్తుంది, దీని మరణాల రేటు ఎంత అనే అంశాలపై శాస్త్రవేత్తలకే ఇంకా పూర్తి స్పష్టత లేదు.
దీనితో పాటు ఎంపాక్స్ (Mpox) కేసులు మళ్లీ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. బర్డ్ ఫ్లూ వైరస్ జంతువుల నుండి మనుషులకు సోకే ముప్పు ఏటా పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హంటావైరస్ లాంటి ప్రమాదకర వైరస్లు కూడా అప్పుడప్పుడు బయటపడుతూ మానవాళిని భయపెడుతున్నాయి.
ప్రస్తుత ప్రపంచ వాతావరణ మార్పులు, అడవుల నరికివేత వంటి కారణాల వల్ల వన్యప్రాణులు మనుషుల నివాస ప్రాంతాలకు దగ్గరవుతున్నాయి. దీనివల్ల కొత్త వైరస్లు జంతువుల నుండి మనుషుల్లోకి దూకే అవకాశాలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు విపరీతంగా పెరిగిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, వలసల కారణంగా ఒక మూలలో మొదలైన వైరస్ కేవలం కొన్ని గంటల్లోనే ఖండాలు దాటి విస్తరిస్తోంది.
కరోనా సమయంలో ధనిక దేశాలు ముందుగా వ్యాక్సిన్లను దాచుకోగా, పేద దేశాలు నెలల తరబడి ఎదురుచూశాయి. ప్రస్తుతం ఎంపాక్స్ విషయంలోనూ అదే పునరావృతమైంది. పేద దేశాలకు ఎంపాక్స్ వ్యాక్సిన్లు చేరడానికి ఏకంగా రెండేళ్లు పట్టింది. అంటే ఒక పేద దేశంలో ప్రాణం విలువకు ఇంకా సరైన గుర్తింపు లభించలేదనే పచ్చి నిజం ఈ గణాంకాల ద్వారా వ్యక్తమవుతోంది.
భవిష్యత్తులో రాబోయే మహమ్మారులు కేవలం ఆరోగ్య సంక్షోభాలుగా మాత్రమే మిగిలిపోవని, అవి దేశాలలో తీవ్రమైన రాజకీయ అస్థిరతను కూడా పెంచుతాయని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. కరోనా సమయంలో సోషల్ మీడియాలో పుకార్లు ఎలా వ్యాపించాయో, వ్యాక్సిన్లపై అనుమానాలు రేకెత్తిస్తూ శాస్త్రవేత్తలపై దాడులు ఎలా జరిగాయో చూశాం. ఇది ప్రభుత్వాలపై ప్రజలకు నమ్మకం పోయేలా చేసింది. రాబోయే రోజుల్లో కొత్త వైరస్ వస్తే అది ప్రజల్లో అవిశ్వాసాన్ని పెంచి, ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీసి సమాజంలో తీవ్ర విభజనలు సృష్టిస్తుంది. అంటే ఒక వైరస్ కేవలం మానవ శరీరాలను మాత్రమే కాకుండా దేశాల సార్వభౌమత్వాన్ని సైతం కూల్చగలదని అర్థమవుతోంది.
భారతదేశానికి ఈ హెచ్చరికలు అత్యంత కీలకం. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆస్పత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ అందక రోగుల మరణాలు, శ్మశానాల్లో ఆగని దహనాలు ఇంకా ప్రజల మదిలోనే ఉన్నాయి. అయినప్పటికీ దేశ ఆరోగ్య వ్యవస్థలో ఇంకా భారీ లోపాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్ల కొరత, బలహీనమైన వ్యాధి పర్యవేక్షణ వ్యవస్థలు, అత్యవసర నిధుల విడుదలలో ఆలస్యం పెద్ద సమస్యలుగా ఉన్నాయి. భారీ జనాభా, వేగంగా పెరుగుతున్న నగరాలు, మరియు రాష్ట్రాల మధ్య నిరంతర వలసలు భారతదేశాన్ని భవిష్యత్ మహమ్మారులకు అత్యంత సున్నితమైన దేశంగా మారుస్తున్నాయి.
ఈ నివేదికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సోషల్ మీడియా పోస్టులు, ఆస్పత్రుల డేటా, మరియు ప్రయాణాల సమాచారాన్ని విశ్లేషించి ఏఐ ద్వారా కొత్త వైరస్ వ్యాప్తిని ముందుగానే అంచనా వేయవచ్చు. కానీ ఇక్కడ కూడా ఒక పెద్ద సమస్య పొంచి ఉంది. ఈ అధునాతన ఏఐ టెక్నాలజీ కేవలం ధనిక దేశాలకే పరిమితమైతే పేద దేశాలు మరింత వెనుకబడిపోతాయి. అంతేకాకుండా, సమాజంలో తప్పుడు సమాచారాన్ని అత్యంత వేగంగా సృష్టించి, వైరల్ చేయడంలో కూడా ఏఐ కీలక పాత్ర పోషించే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది.
ప్రపంచ దేశాలు నిజంగా ఈ హెచ్చరికలను సీరియస్గా తీసుకుని కలిసికట్టుగా అడుగులు వేస్తాయా, లేదా కరోనా జ్ఞాపకాలు పూర్తిగా చెరిగిపోయాక మరో కొత్త వైరస్ వచ్చే వరకు నిర్లక్ష్యంగానే ఉంటాయా అనేది రానున్న రోజుల్లోనే తేలాల్సి ఉంది. ఒకవేళ అంతర్జాతీయ సమాజం గనుక ఇప్పుడే మేల్కొనకపోతే, భవిష్యత్తులో కరోనాను మించిన భారీ ప్రాణ నష్టం, ఆర్థిక విధ్వంసం తప్పవని ఈ నివేదిక నిష్కర్షగా చెబుతోంది.