Former Maharashtra governor Vidyasagar Rao comments became sensational: మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు చేసిన కామెంట్లు తెలుగు రాష్ట్రాల బీజేపీ నేతలల్లో కలకలం రేపాయి. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ యూనిట్లకు కొత్త అధ్యక్షులు వస్తారన్నది ఆయన గురువారం చేసిన కామెంట్. దీంతో అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు లక్ష్మణ్, లక్ష్మీనారాయణలిద్దరు ఇరకున పడ్డారు. తమను మార్చి వేరే వారికి అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతారన్నట్లుగా సాగర్ జీ చేసిన కామెంట్లు అధ్యక్షులిద్దరినీ ఇబ్బందుల్లోకి నెట్టాయి.
అయితే.. సాగర్ చేసిన కామెంట్లను అంత సీరియస్గా తీసుకోవద్దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారు. తనను కొనసాగించినా కూడా రాష్ట్ర యూనిట్కు కొత్త అధ్యక్షుడు వచ్చినట్లుగానే భావించాల్సి వుంటుందన్నది లక్ష్మణ్ ఇచ్చిన వివరణ. అటు కన్నా కూడా పైకి సాగర్ వ్యాఖ్యలను తేలికగా తీసుకుంటున్నట్లుగానే మాట్లాడారు. సాగర్ వ్యాఖ్యలు రేపిన కలకలం.. చివరికి ఆయనకే చుట్టుకున్నాయి.
చివరికి హైదరాబాద్ రాగానే ఆయనే స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. శుక్రవారం హైదరాబాద్లో ఆయన టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిరేసులో లేనని చెప్పుకున్నారు. ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన తనకు మరోసారి స్టేట్ యూనిట్ ప్రెసిడెంట్ అవ్వాల్సిన అవసరం లేదని సాగర్ చెప్పుకొచ్చారు. గవర్నర్ పదవి నుంచి వైదొలగిన తర్వాత తాను బీజేపీలో మళ్ళీ క్రియాశీలక పాత్ర పోషిస్తానని చెబుతున్న సాగర్ తన మదిలో ఏం ఆలోచన వుందనేది తెలియకుండా గుంభనంగా వుంటుండడం విశేషం.