ఖమ్మం: టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ కీలక హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం ఖమ్మంలో జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్, బీజేపీల పాలన ఇకపైన ఉండదని.. కేంద్రంలో రాబోయేది ఫెడరల్ ఫ్రంట్ కూటమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి లోక్సభ ఎన్నికలు చాలా కీలకమైనవని.. జాతిని చైతన్యవంతం చేయడంలో తెలంగాణ ప్రజలు కీలకపాత్ర పోషించాలని ఆయన కోరారు. ప్రాంతీయ పార్టీలకు 260 సీట్లు రాబోతున్నాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. టీఆర్ఎస్లో టికెట్ దక్కని నేతలు, గత ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు నిరాశ పడవద్దని.. రాబోయే రోజులు అన్ని మనవే అని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ నేతలు గవర్నర్లు, విదేశీ రాయబారులు అయ్యే రోజులు వస్తాయని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ నేతల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.