గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ షురూ.. తొలిరోజే 17 మంది, 20 నామినేషన్లు దాఖలు

|

Nov 18, 2020 | 7:54 PM

గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. తొలిరోజు నామినేషన్ పర్వం మొదలైంది.

గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ షురూ.. తొలిరోజే 17 మంది, 20 నామినేషన్లు దాఖలు
Follow us on

గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. తొలిరోజు నామినేషన్ పర్వం మొదలైంది. తొలి రోజు నుంచే నామినేషన్ల షురూ కావడంతో జీహెచ్ఎంసీ కార్యాలయాలు సందడిగా మారాయి. బుధవారం తొలిరోజు 17 మంది అభ్యర్థులు 20 నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఆరు నామినేషన్లు దాఖలు కాగా, బీజేపీ నుంచి రెండు నామినేషన్లు సమర్పించారు. ఇటు, టీడీపీ నుంచి ఐదు, కాంగ్రెస్‌ పార్టీ తరుపున మూడు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మూడు, మరో పార్టీ నుంచి మరో నామినేషన్‌ దాఖలయ్యాయి. అన్ని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయాల్లో రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తున్నారు.

నామినేషన్ల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలోని 150 రిటర్నింగ్ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నామినేషన్‌ వేసేందుకు అభ్యర్థితోపాటు మరో ఇద్దరిని మాత్రమే రిటర్నింగ్‌ అధికారి చాంబర్‌లోకి అనుమతి ఇస్తున్నారు. ఈ నెల 20వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. గ్రేటర్ పరిధిలో డిసెంబర్ 1న పోలింగ్‌ జరుగనుంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో నగరంలోని ఫ్లెక్సీలు, బ్యానర్లను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. కాగా, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించాయి. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంటుందని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.