ప్రకాశం జిల్లా చీరాలలో కాకరేపుతున్న వర్గ పోరు..నివురుగప్పిన నిప్పులా మత్స్యకార గ్రామాలు

ఇక తమ వారిపై దాడి చేసిన వాళ్లను గుర్తించామన్నారు.  డీఐజీ త్రివిక్రమవర్మ స్వయంగా బందోబస్తులో పాల్గొని ఎంపీ పర్యటనలో శాంతిభద్రతలు పర్యవేక్షించినప్పటికీ ఘర్షణలు జరగటం గమనార్హం.

ప్రకాశం జిల్లా చీరాలలో కాకరేపుతున్న వర్గ పోరు..నివురుగప్పిన నిప్పులా మత్స్యకార గ్రామాలు

Updated on: Dec 15, 2020 | 10:14 PM

మత్స్యకారులు నేతల అనుచరులపై దాడి చేయడం ప్రకాశం జిల్లా చీరాలలో కాక రేపుతోంది. నిన్న జరిగిన దాడితో చీరాల, వేటపాలెం మండలాల్లోని మత్స్యకార గ్రామాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. పది రోజుల నుంచి జరుగుతున్న గొడవల కంటే … సోమవారం అధికార పార్టీ నేతలపై జరిగిన దాడి మరింత టెన్షన్ పుట్టిస్తోంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది.

ప్రకాశంజిల్లా చీరాల నియోజకవర్గంలో మత్స్యకారుల మధ్య నెలకొన్న వివాదం రాజకీయరగడగా మారింది. వైసీపీలో రెండు వర్గాలుగా ఉన్న ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చెందిన ఇరువర్గాలకు కొద్ది రోజులుగా నియోజకవర్గంలో టగ్ ఆఫ్‌ వార్ జరుగుతోంది. సిస్ట్యూవేషన్ వచ్చినప్పుడల్లా రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. చీరాల మండలం వాడరేవు, వేటపాలెం మండలం కఠారివారిపాలెం గ్రామాల మత్స్యకారుల మధ్య వలల కోసం జరిగిన కొట్లాట వెనుక కూడా రాజకీయ ప్రమేయం ఉందని రెండు వర్గాల నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.

కఠారివారిపాలెం, వాడరేవుతో పాటు మరో 75 మత్స్యకార గ్రామాల ప్రజలు ఆందోళనలు, ఘర్షణలు ఇప్పుడు నియోజకవర్గ నేతలకు చుట్టుకున్నాయి. గొడవ సీఎం దృష్టి వరకు వెళ్లడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ రంగంలోకి దిగిన ప్రయోజనం లేకపోయింది.

ఆయన వచ్చిన సమయంలోనే ఘర్షణలు చెలరేగి ఎవరు ఎవరిని కొడుతున్నారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. చీరాల నియోజకవర్గంలోని కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చెందిన ఇరువర్గాలు ఈ దాడుల్లో గాయపడ్డారు. ఇందులో ముగ్గురు ఆమంచి వర్గీయులుండగా ఇద్దరు కరణం వర్గానికి చెందిన వాళ్లున్నారు.

కాన్వాయ్‌లో ఒకరి వాహనాలను ఒకరు అధిగమించేందుకు బలరాం, కృష్ణమోహన్‌ అనుచరులు ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే ఘర్షణ జరిగిందని ఆమంచి వర్గీయులు అంటుంటే…కాదు మత్స్యకారుల మధ్య గొడవకు కారణం ఆమంచి కాబట్టే వాళ్లు ఎంపీ సమక్షంలోనే తిరగబడ్డారని బలరాం వర్గీయులంటున్నారు.

వాడరేవు, కఠారివారిపాలెం మత్స్యకారుల గొడవకు కారకులు ఆమంచి కృష్ణమోహనే అంటున్నారు వైసీపీ నేతలు. పరామర్శించేందుకు వెళ్లిన సమయంలో ఆయన వర్గీయులపై దాడి చేయడం, ఆయన్ని మత్స్యకారులు నిలదీయడమే ఇందుకు సాక్ష్యమంటున్నారు. అయితే ఈ గొడవలు పరిష్కరించే సామర్ధ్యం కూడా ఆయనకే ఉందంటున్నారు.

రాజకీయ ఉనికి చాటుకోవడం కోసం ఓ వర్గం మత్స్యకారుల్ని ఉసిగొల్పడం వల్లే దాడులు జరిగాయన్నారు ఆమంచి కృష్ణమోహన్. మత్స్యకారుల వివాదాన్ని పరిష్కరించడంలో పోలీసులు విఫలమైనట్లు చెప్పారాయన. ఇక తమ వారిపై దాడి చేసిన వాళ్లను గుర్తించామన్నారు.  డీఐజీ త్రివిక్రమవర్మ స్వయంగా బందోబస్తులో పాల్గొని ఎంపీ పర్యటనలో శాంతిభద్రతలు పర్యవేక్షించినప్పటికీ ఘర్షణలు జరగటం గమనార్హం.

Loading...
Unable to load recommendations.
Follow Us